కార్యాలయాల్లో చెట్లకింద నిరీక్షణలకు తెర నేటి నుంచి మరో 25
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ రద్దీ ఉన్నచోట అదనపు
సిబ్బంది నియామకం: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు స్వీకారం చుట్టామని రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు వచ్చే కొనుగోలు దారులు, అమ్మకం దారులు గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించాల్సిన పరిస్థితిని మార్చుతూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరించడమే కాక, స్లాట్ బుకింగ్ విధానాన్ని దశలవారీగా అమలులోకి తీసుకు వస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే గత నెల పదవ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేశామని, అక్కడ విజయవంతం కావడంతో ఈ నెల 12 నుంచి మరో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు ప్ర కటించారు. వచ్చే నెల చివరినాటికి రాష్ట్రంలోని 144 సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, సమర్థమైన సేవలందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయవలసిన బాధ్యత అధికారులదే స్పష్టం చేశారు.
సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లు : పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి, 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడు ఉన్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని, ఇప్పటికే ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు , సిబ్బందిని నియమించడం జరిగిందని, విజయవంతమైన ఈ విధానాన్ని ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశపెడుతూ అదనంగా ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ ని నియమించడం జరుగుతుందని తెలిపారు.
స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వవస్థీకరణ చేస్తున్నామని, ఇందులో భాగంగా అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని విలీనం చేసి పని భారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని , ఇందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట, సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధి విలీనం విజయవంతం కావడంతో షాద్ నగర్, ఫారూక్ నగర్, సిద్దిపేట, సిద్దిపేట (రూరల్) విలీనం చేయడం జరిగిందన్నారు.
స్లాట్ బుకింగ్ అమలు కానున్న కార్యాలయాలు ఇవే : హైదరాబాద్ ఆర్.ఓ. ఆఫీసు, హైదరాబాద్ ఆర్.ఓ. ఆఫీసు సౌత్ , నారపల్లి, ఘట్కేసర్, మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట్, సిద్దిపేట్ రూరల్, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్.ఓ. ఆఫీసు, జనగాం, ఘన్పూర్, నర్సంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మహేశ్వరం, రంగారెడ్డి ఆర్.ఓ. ఆఫీసు, షాద్ నగర్, ఫరూక్ నగర్ , వనస్థలిపురం, శేరిలింగంపల్లి కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సోమవారం నుంచి అమలు కానుంది.