బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 18 సంవత్సరాల తరువాత ఐపిఎల్ కప్ సాధించడంతో ఆర్సిబి జట్టు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించడంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడు కమల్ హాసన్, మాజీ టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఘటన తన హృదయాన్ని ముక్కలు చేసిందని నటి అనుష్క శర్మ బాధను వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన మాటలకందని విషాదం అని సచిన్ తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని, ఇలాంటి మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని సచిన్ తెలిపారు. ఆర్సిబి జట్టు ఘనంగా నిర్వహించిన విజయోత్సవాలలో జరిగిన సంఘటన హృదయ విదారకరమైందని నటుడు కమల్ హాసన్ తెలిపారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కమల్ పేర్కొన్నారు.