పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అనుకోకుండా ఐపిఎల్ కప్ సాధించుకున్న ఆర్సిబికు ఆ మరుసటి రోజే విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. ఇటువంటి విషాదకర ఘటన నివారింపదగిందే అయినప్పటికీ సంబంధీకులు అందరూ బాధ్యతారహితంగా వ్యవహరించడంతో జరిగినట్లు స్పష్టం అవుతుంది. అందుకనే ఈ తొక్కిసలాటకు తామంటే తాము బాధ్యులం కామని అందరూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా నలుగురు ఈ ఘటనకు బాధ్యులని పేర్కొనవచ్చు. ప్రభుత్వం, పోలీసులు, ఆర్సిబి, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. మొదటగా నగర కమిషనర్తోపాటు కొందరు పోలీసు అధికారులపై వేటు వేయడం, బదిలీ చేయడం ద్వారా వారిపై నెపం రుద్దే ప్రయత్నం ప్రభుత్వం చేసింది.
కానీ, స్పష్టంగా మరుసటి రోజే సంబరాలకు తొందర ఎందుకు, రెండు రోజులు ఆగమని పోలీసులు స్పష్టం చేసినట్లు వెల్లడి అవుతున్నది. ముఖ్యంగా విధానసౌద్ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ జరపవద్దని స్థానిక డిసిపి లిఖితపూర్వకంగా ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకే పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన సందర్భంగా ఆ రోజు సంబరాలు జరిపితే జనాన్ని నియంత్రించడం కష్టం అని స్పష్టం చేశారు. అయితే, సిఎంఒ నుండి ఒక అధికారి, మరో వంక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) ల ద్వారా ఆర్సిబి ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఉదయం 7 గంటలకే సంబరాల గురించి, ర్యాలీ గురించి సోషల్ మీడియా ద్వారా ఆర్సిబి ప్రకటించింది.
ర్యాలీ లేదని 12 గంటలకు ట్రాఫిక్ విభాగం ప్రకటించినా, 1 గంటకు కూడా ఉందంటూ ఆర్సిబి ప్రచారం చేసింది. వాస్తవానికి అంత తొందరగా మరుసటి రోజే సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. కప్ గెలుస్తామని ముందుగా అంచనాలు లేకపోవడంతో, సంబరాలకు సన్నాహాలు ముందుగా చేసుకున్న దాఖలాలు లేవు. అనుకోకుండా కప్ రావడంతో భావోద్వేగంతో ఇటువంటి సంబరాలకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నది. అయితే, ఈ విషయంలో పోలీసులతో కలసి సన్నాహాలు చేసుకొనే ప్రయత్నం చేయాల్సింది. ఆర్సిబి ఇప్పటివరకు కప్ గెలవలేకపోయినా దేశంలో మరే ఐపిఎల్ టీం కు లేనంతటి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు మొదట్లో విజయ మాలవ్య, ఆ తర్వాత సారథులు విరాట్ కోహ్లీకున్న క్రేజ్ ను ఆసరా చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడమే కారణం.
అందుకనే ఎప్పుడూ కప్ గెలవలేకపోయినా వ్యాపారపరంగా ముంబై, చెన్నై, కలకత్తాలకు మించి స్పాన్సర్స్ను సంపాదించి భారీగా ఆదాయం పొందుతున్నారు. ఆదాయం మీదున్న ఆసక్తి సంబరాల నిర్వహణకు తగు ప్లాన్ చేయడం లేకపోవడంతో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకుంది. పైగా, ఈ మధ్య కాలంలోనే కుంభమేళా సందర్భంగా భయంకరమైన తొక్కిసలాట జరిగింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో పుష్ప-2 విడుదల సందర్భంగా జరగడం చూసాం. అటువంటి అనుభవాల నుండైనా గుణపాఠాన్ని గ్రహించే ప్రయత్నం ఆర్సిబి, కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు చేయలేదు. పోలీసు అధికారులు చెప్పినట్లు మరో రెండు రోజుల తర్వాత సంబరాలు జరిపితే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మరుసటి రోజు జరపడంతోనే తొక్కిసలాట జరిగిందని అంటూ తమ బాధ్యతలను నిరాకరించే ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు.
గతంలో అంబరీష్, పునీత్ రాజ్కుమార్ వంటి నటుల మృతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు తోసుకొంటూ వచ్చిన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనకు ఆస్కారం లేకుండా చూసిన ఘనత బెంగళూరు పోలీసులకు ఉందని మరవలేం. వేడుక జరిగిన చిన్నస్వామి స్టేడియంతో తమకు సంబంధం లేదన్నట్లు పోలీసులు వ్యవహరించారు. దానికి 20 గేట్లు ఉంటే కేవలం మూడు మాత్రమే తెరవడంతో, ఒక గేటు వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. వెంటనే జోక్యం చేసుకొని, మరికొన్ని గేట్లను తెరిపించి ఉంటే ప్రమాదం కొంతవరకు అదుపులోకి వచ్చి ఉండెడిది. ఈ విషయంలో క్రికెట్ అసోసియేషన్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పాలి.
తొక్కిసలాట దృశ్యాలను చూస్తే నిర్వహణ, భద్రతా వైఫల్యాలు, నిఘా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఘటన తీవ్రత రీత్యా రాష్ట్ర హైకోర్టు సైతం సుమోటోగా స్వీకరించి తక్షణ విచారణ ప్రారంభించి సంధించిన ప్రశ్నలు ఈవెంట్ నిర్వహణలో లోపాలను ప్రాథమికంగా నిర్ధారించేవిగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించైనా నేరుగా సమాధానాలు ఇవ్వకుండా ఇతరులపై నెపం నెట్టివేసి ప్రయత్నాలు కనిపించాయి. ఆర్సిబి కప్ గెలవగానే ఆ రాత్రి అంతా లక్షలాది మంది ప్రజలు బెంగళూరు వీధులలో సంబరాలు చేస్తూ కనిపించారు. పోలీసులు సైతం వారిని అదుపు చేస్తూఅలసిపోయినట్లున్నది. అందుకనే మరుసటి రోజే విజయ సంబరాలు అంటూ ఆర్సిబి సోషల్ మీడియా ద్వారా ప్రకటించగానే ఉదయంనుండే జనం రహదారులపైకి చేరుకోవడం ప్రారంభమైనది. పైగా, రాత్రి సంబరాలలో తక్కువగా ఉన్న మహిళలు పగలు పెద్ద సంఖ్యలో రావడం, సంబరాల నిర్వహణకు పోలీసులు, ప్రభుత్వంతోపాటు ఆర్సిబి సైతం ఎటువంటి సన్నాహాలు చేయకపోవడంతో తొక్కిసలాట అనివార్యంగా మారింది. అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే.
పోలీసులు కనీసం బారికేడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం, అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వంటివి నేరమయ నిర్లక్ష్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. పైగా, ఒక వంక స్టేడియంలో సంబరాలు అని ప్రకటించి, మరోవైపు విధాన సౌద్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఎందుకు సన్మానం చేయాల్సి వచ్చింది? దాని కారణంగా అభిమానులు అంత పెద్ద సంఖ్యలో క్రీడాకారుల బస్సును వెంబడిస్తూ తిరగడం జరిగింది. సంబరాలు ప్రభుత్వ కార్యక్రమం కాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేసినా, ప్రభుత్వంలోని పలువురు పెద్దలు హద్దుమీరి ఉత్సాహం చూపడం జరిగింది. అయితే, తగు జాగ్రత్తలు తీసుకోవడంలో అటువంటి ఆసక్తి కనబరచలేదు. అయితే, ఈ తొక్కిసలాట సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని మెచ్చుకోవలసిందే. కుంభమేళా తొక్కిసలాటలో అసలేమీ జరిగిందో ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించలేదు.
కనీసం మృతుల జాబితాను సైతం బహిరంగపరచలేదు. ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట సమయంలో సైతం మృతుల కుటుంబాలకు అక్కడనే నగదు పరిహారం అందజేసి, ఎవ్వరికీ కనిపించకుండా వారిని పంపే ప్రయత్నం చేశారు. మృతుల జాబితా బయటకు రాకుండా చూసారు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆసుపత్రులకు వెళ్లి పరామర్శలు చేయడమే కాకుండా, సాయంత్రం 7.30 గంటలకల్లా మృతుల జావితాను ప్రకటించారు. తొలుత కొంత గందరగోళం జరిగినా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో కీలకమే కాకుండా, పరిస్థితుల తీవ్రత మరింతగా దిగజారకుండా కాపాడేందుకు దోహదపడుతుంది.
ఈ సందర్భంగా ఐపిఎల్ మొత్తం క్రికెట్ను ఓ జూదంగా మార్చివేసిందని, కార్పొరేట్ కంపెనీల వ్యాపార ప్రక్రియగా మార్చివేసిందనే విమర్శలు ఈ సందర్భంగా వస్తున్నాయి. అసలైన క్రీడా స్ఫూర్తికి ఆస్కారం లేకుండా చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అసలు క్రికెట్కు సంబంధం లేనివారు, ఎప్పుడూ క్రికెట్ బ్యాట్ కూడా పట్టుకొని వారు బిసిసిఐలో, ఐపిఎల్ టీంల నిర్వహణలో కీలకంగా మారి, వారే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా క్రికెట్ నేడు ఓ కీలకమైన వినోదంగా మారిందని గుర్తించాలి. సినిమా తారలకు మించి కొందరు క్రికెట్ క్రీడాకారుల పట్ల జనంలో క్రేజ్ కనిపిస్తున్నది. క్రికెట్ కారణంగా మిగిలిన ముఖ్యమైన ఆటలకు స్పాన్సర్లు దొరకడం లేదని, ఆయా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదని కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, వందల సంఖ్యలో యువకులు నూతనతరం క్రికెట్ క్రీడాకారులుగా వెలుగులోకి వచ్చేందుకు ఐపిఎల్ దోహదపడుతుందని మరచిపోలేం.
క్రికెట్ క్రీడాకారులు సైతం నేడు భారీ ఆదాయాలు పొందుతున్నారు. పైగా ఐపిఎల్లో రాణించిన వారు భారత దేశ జట్టులో చేరుతూ ఉండడంతో అంతర్జాతీయంగా భారత జట్టు గతంలో ఏనాడూ లేని విధంగా విజయాలు సాధిస్తూ వస్తున్నది. కార్పొరేట్ రంగంలోని వారు ఐపిఎల్ను సైతం ఓ వ్యాపారంగా మార్చివేస్తున్నప్పటికీ యువతకు ఇంతటి ప్రోత్సాహం అందించేందుకు దోహదం చేయడాన్ని ఎందుకు నిరాకరించాలి? ముంబై, చెన్నై జట్లు అనేక పర్యాయాలు ఐపిఎల్ కప్లు గెలుచుకున్నాయి. వారు కూడా సంబరాలు జరుపుకున్నారు. అయితే అక్కడెక్కడా బెంగళూరులో మాదిరిగా భావోద్వేగాలు ఇమిడిలేకపోవడం గమనించాలి. ప్రపంచ కప్ గెలిచినా ముంబైలో ఇంతటి భావోద్వేగం ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. లక్షల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చినా ఓ సాధారణమైన అంశంగా చాలా ప్రశాంతంగా సంబరాలు జరుపుకోవడాన్ని చూసాం. చివరకు ఆయా జట్ల క్రీడాకారులతో సైతం భావోద్వేగాలు అంతగా కనిపించేవి కావు.
కానీ బెంగళూరులో ముందుగా క్రీడాకారులు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ స్టేడియంలోని కన్నీటీతో భావోద్వేగానికి గురికావడం ద్వారా మొత్తం కర్ణాటక ప్రజలను భావోద్వేగంతో నింపివేసారు. ఎందుకంటే, ప్రతి ఏడాది ‘ఈ సారి కప్ మాదే’ అంటూ హడావుడి చేయడం, చివరకు బొక్కబోర్లా పడుతూ రావడంతో ఓ విధమైన నైరాశ్యంలో చిక్కుకున్న ఆర్సిబి జట్టుకు మాత్రమే కాకుండా మొత్తం కర్ణాటక ప్రజలకు తీవ్రమైన భావోద్వేగమైన అంశంగా మారింది. కేవలం బెంగళూరు నుండే కాకుండా మొత్తం కర్ణాటక నుండి అభిమానులు పెద్దసంఖ్యలో రావడం, ఆ రీతిలో సన్నాహాలు జరగకపోవడంతో ఇటువంటి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటను ఓ గుణపాఠంగా స్వీకరించి, దేశంలో ఐపిఎల్ జట్లు అన్ని ఇక ముందు జాగ్రత్త వహించాలి. ఓ జట్ట ఫైనల్కు దగ్గరగా జరిగినప్పుడే కప్ సాధిస్తే సంబరాలు ఏవిధంగా జరపాలో ముందుగా ఓ ప్రణాళిక తయారు చేసుకొని విధంగా చూడాలి.
- చలసాని నరేంద్ర
98495 69050