ఒడిశాలోని పూరిలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో (Jagannath Rathyatra) అపశృతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు గుండిచా ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. గుండిచా ఆలయం సమీపంలో ఉన్న శారదబాలి సమీపంలో రథంపై (Jagannath Rathyatra) కూర్చున్న జగన్నాథుడిని చూసేందుకు భక్తులు భారీగా వచ్చారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసుల తరం కాలేదు.
జనసమూహం ఒక్కసారిగా పెరిగి.. తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో మృతులను, గాయపడిన వారిని పూరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. మృతి చెందిన ఖుర్జా జిల్లాకు చెందిన ప్రేమకాంతి మొహంతి(80), బసంతి సాహూ(36), ప్రభాతి దాస్(42) గా గుర్తించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.