రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఈనెల 30లోగా పిసి ఘోష్ కమిషన్కు అప్పటి మంత్రివర్గం మినిట్స్తో రిపోర్టు అన్ని జిల్లా
కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి ఆమోదం చౌటుప్పల్ నుంచి
సంగారెడ్డి వరకు 201 కి.మీటర్ల అలైన్మెంట్కు గ్రీన్సిగ్నల్ సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఇంద్రేశం,
జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు తెలంగాణ రైజింగ్ విజన్పాలసీకి డాక్యుమెంట్ రూపకల్పన
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్యలు ప్రతి మూడు నెలలకు ఒకసారి కేబినెట్ నిర్ణయాల
అమలుపై స్టేటస్ రిపోర్టు మీటింగ్ ఐదు గంటల పాటు రేవంత్ నేతృత్వంలో మంత్రివర్గం సుదీర్ఘ భేటీ
నూతన క్రీడా పాలసీకి ఆమోదముద్ర
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్ చర్చించింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ విచారణ విషయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పిసి ఘోష్ కమిషన్కు గత బిఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గ మినిట్స్తో కూడిన పూర్తి నివేదికను ఈ నెల 30వ తేదీ లోగా కమిషన్కు అందివ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుమారుగా 5 గం టల పాటు జరిగింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం పై దృష్టి సారిస్తూ పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ భేటీలో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేయాలని, అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవాలు జరపాలని నిర్ణయించింది.
నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వంచాలని మంత్రివర్గం తీర్మానిం చింది.
ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. క్రీడా లోకం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నూతన స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ఇదే కాగా, ముగ్గురు కొత్త మంత్రులు వివేక్, శ్రీహరి, లక్ష్మణ్లు తొలిసారిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. కీలక అంశాలపై కేబినెట్ భేటీ 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు పలు అంశాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎపి తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చట్టపరంగా, న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల హై లెవల్ కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులతో పాటు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి చౌటుప్పల్ టు సంగారెడ్డి వరకు దక్షిణ భాగం అలైన్మెంట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆర్ అండ్ బి విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను ఈ సందర్భంగా కేబినేట్ పరిశీలించి చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలో మీటర్ల పొడవు ఉండే అలైన్మెంట్ కు కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. దీంతోపాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెం ట్ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో రెండు కొత్త మున్సిపాలిటీలతో పాటు పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి మూడు నెలలకోసారి కేబినెట్ మీటింగ్ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించారు.ఈ మూడు నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గం తో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని మంత్రివర్గం నిర్ణయించింది.