పాక్ పోరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్లు పరస్పరం యుద్ధం కొనసాగించకుండా నియంత్రించానని, అణు విపత్తుకు దారి తీసే పోరును ఆపగలిగినందుకు గర్వంగా ఉందని అన్నారు. పరస్పరం కాల్పులు జరుపుకునే దేశాలతో తాము వాణిజ్యం కొనసాగించలేమని గతంలో ఇరు దేశాలకు స్పష్టం చేశానని ట్రంప్ తెలిపారు. యుద్ధాన్ని ఆపకపోయినట్లయితే అమెరికా రెండు దేశాలతో వాణిజ్యాన్ని బంద్ చేస్తుందని తాను భారత్, పాకిస్థాన్లకు స్పష్టం చేసినట్లు గత కొద్ది వారాలుగా ట్రంప్ పదే పదే చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్తో సైనిక ఘర్షణ సమయంలో భారత్, అమెరికా నేతల మధ్య జరిగిన చర్చల్లో వాణిజ్యం అంశం ప్రస్తావనకే రాలేదని భారత్ గత గురువారం నాడు స్పష్టం చేయడం ద్వారా ట్రంప్ చేస్తున్న వాదనలను నిర్దందంగా తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అయినా ట్రంప్ మాత్రం పాతపాటే ఇంకా పాడుతున్నారు. భారత్ పాకిస్థాన్ల మధ్య పోరు అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందని భావించానని శుక్రవారం ఓవల్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.
‘ తూటాల ద్వారా కాకుండా వాణిజ్యం ద్వారా అణు యుద్ధ ప్రబాదాన్ని ఆపగలిగినందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. సాధారణంగా అవి తూటాల ద్వారా ఆ పని చేస్తాయి. అయితే మనం వాణిజ్యం ద్వారా యుద్ధాన్ని అపగలిగాం. ఇరు దేశాలు యుద్ధాన్ని ముగించినందుకు ఆ దేశాల అధినేతలకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇరు దేశాలతో తాము సాగిస్తున్న వాణిజ్య వ్యవహారాలపై మాట్లాడుకున్నామని, పరస్పరం కాల్పులు జరుపుకొంటూ, అణ్వాయుధాలు ఉపయోగించే సత్తా కలిగిన దేశాలతో తాము వాణిజ్యం జరపలేమని స్పష్టం చేశామని అమెరికా అధ్యక్షుడు అన్నారు. భారత్, పాక్లకు చెందిన నేతలు తమను అర్థం చేసుకున్నారని, తమ వినతిని అంగీకరించి యుద్ధాన్ని ముగించారని ఆయన అన్నారు. అంతేకాదు, అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ ప్రతినిధులు వచ్చేవారం వాషింగ్టన్కు రానున్నట్లు కూడా ట్రంప్ చెప్పారు.