Monday, June 9, 2025

బానిసత్వ జీవితాలకు యథార్థ రూపం ఏడు తరాలు (రూట్స్)

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా వెలువడిన సాహిత్యం లో మొదటి పది వరసల్లో ఒకటిగా నిలుస్తుంది ‘ఏడు తరాలు’ (రూట్స్) నవల. స్వేచ్ఛ నుంచి సంకెళ్ళ కు, సంకెళ్ళ నుండి విముక్తికి సాగిన ఒక ప్రస్థానం ‘ఏడు తరాలు’. తరతరాల బానిసత్వం గురించి ఈ నవలలో పేర్కొన్న విధానం నమ్మలేనిది కాదు. యధార్థ సత్యం. ‘ఏ డుతరాలు’ నవలా రచయిత ‘అలెక్స్ హేలీ’. ఈయన జన్మస్థలం న్యూయార్క్. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన అతి కొద్ది పుస్తకాల్లో ఈ ‘ఏడు తరాలు’ నవల ఒకటి. అమ్మకాలలో ఈ నవల పెను సంచలనాలను న మోదు చేసింది. కోట్లాది పాఠకుల ఆదరాభిమానా లు ఈ నవలకు దక్కాయి. తెలుగు అనువాదాన్ని ‘సహవాసి’ ఇతివృత్తాని కి ఏమాత్రం భంగం కలగని రీతిలో చేసారు. తెలుగులో దాదాపు 20 సార్లకు పైగా ఈ నవల పునర్‌ముద్రణ పొందింది.

ఆఫ్రికా అంటే చీకటి ఖండం అనే లైనుతో ఈ నవల ప్రారంభమవుతుంది. ఇటు ఆఫ్రికాలో ప్రతివారికీ నాగరికత, సంస్కృతి, వారసత్వం లేనివాళ్లుగా పేర్కొంటూ, అమెరికాను సాహసోపేత జన్మభూమిగా అమెరికన్ల అభిప్రాయంగా నుడివి, అలా పేర్కొంటూనే విజేతలు రాసిన, చరిత్ర కూసి న కారుకూతలుగా రచయిత తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. అయితే, శతాబ్దాల కిందటే ఆఫ్రి కా మారుమూల కుగ్రామాల్లో పరిపాలనా వ్యవస్థ ఉండేదని, ప్రతి బాలుడికీ నిర్బంధ విద్య ఉండేదని, అటువంటి సాంస్కృతిక వికాసాన్ని తెల్లవాళ్ళ రాక తో ఆఫ్రికా ప్రజలు కోల్పోయారని తెలిస్తే ఆశ్చ ర్యం కలుగుతుంది. ఆఫ్రికాను బానిసల సరఫరా కేంద్రంగా అమెరికా మార్చిన తీరు నివ్వెరపాటును కలుగజేస్తుంది. 1619లో కేవలం ఇరవై మంది ఉన్న బానిసల సంఖ్య 1810 నాటికి పది లక్షల సంఖ్య దాటింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. దాదాపు అందరూ బలవంతంగా చెరబట్టిన వాళ్ళే. తెల్లవాళ్ల దాష్టీకానికి నల్ల బానిసలు నానా కష్టాలు అనుభవించారు. నల్లవాళ్ళ శ్రమను తెల్లవాళ్ళు విస్తారంగా దోచారు. అయితే, ఈ అతి భయంకర బానిస వ్యవస్థలో అనేక తిరుగుబాట్లు కూడా ప్రజ్వరిల్లాయి. ఇందుకు నాయకత్వం వహించిన వారు హీనంగా మరణించారు. అమెరికా అణచివేత విధానం అలా ఉండేది.

1865 ఏప్రిల్, 9న అమెరికా అంతర్యుద్ధం ముగిసిన అనంతరం అబ్రహాం లింకన్ బానిసత్వ నిర్మూలన ప్రకటించి, నల్లవాళ్ళకు ఆశాదీపంగా నిలిచాడు. అయితే, వారంలోపే లింకన్ ఓ తెల్ల జాత్యహంకారి ఘాతుకానికి బలయిపోయిన సంఘటన ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. తెల్లవాళ్ళ దాస్యం నుంచి విముక్తులైనా, నల్లజాతి ప్రజలు నేటికీ వర్ణ వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నారు. ‘ఏడు తరాలు’ (రూట్స్) నవల 1750 సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. పడమటి ఆఫ్రికా గాంబియాలోని ఓ మారుమూల పల్లెటూ రు జపూరులో అప్పుడే ఓ బిడ్డ ఈ భూమ్మీద పడుతుంది. తమ జాతిలాగానే ఆ పుట్టిన బిడ్డ సైతం నల్లగా ఉంటుంది. సంప్రదాయబద్ధంగా ఆ రోజు ల్లో కూడా వేడుకను వారి స్థోమత ప్రకారం జరిపేవారు. ఆ బిడ్డ పేరును ‘కుంటా’గా నామకరణం చేసినప్పటి నుంచి ఈ నవల అనేక పార్శ్వాలను సృజిస్తుంది. క్యాలండర్లు లేని ఆ రోజుల్లో ఒక్కో వర్షాకాలాన్ని ఒక్కొక్క సంవత్సరంగా పరిగణించేవారు. నవలలోని పాత్రల ప్రకారం వారంతా మైనారిటీ వర్గాలకు చెందిన వారని అవగతం అవుతుంది. ఒక ప్రాయం వచ్చాక బాలలను పురుషులు గా మార్చే కఠిన శిక్షణ మొదలవుతుంది. ఆ శిక్షణ పూర్తయ్యాక తన వారిని చేరుకుంటాడు ‘కుంటా’. ఒకరోజు కట్టెలు కొట్టడానికి వెళ్లిన కుంటాను తెల్లవాళ్లు బలవంతంగా అపహరిస్తారు. వారి ముందు కుంటా మొండి దైర్యం పనిచేయలేదు.

బానిసత్వపు లోకానికి ఇక్కడినుంచే బీజం పడుతుంది. స్పృహలోకి వచ్చిన కుంటా తాను ఇనుప గొలుసులతో బందింపబడినట్లు తెలుసుకుంటాడు. అక్కడి వాతావరణం అతి దారుణంగా ఉంటుంది. తనతో పాటు మరో పదిమందిని తెల్లవాళ్ళు బానిసలుగా చేసుకున్న వైనాన్ని గమనించి న కుంటా ఏమీ చేయలేని అశక్తుడు అవుతాడు. అలా బంధింపబడిన వారిని తెల్లవాళ్ళు చిత్రహింసలు పెట్టిన విధానాన్ని రచయిత వర్ణిస్తుంటే పాఠకుల హృదయం ద్రవిస్తుంది. అలా తమ స్వాధీనం లో బానిసలుగా చేసుకున్న వారిని ఒక ఓడ ద్వారా ఆఫ్రికా ఖండం దాటించారు. చిత్రహింసలు తట్టుకోలేక మరణించిన వారిపై ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేని కర్కశత్వంతో వ్యవహరించారు తెల్లవా ళ్లు. వీరినే కాకుండా ఆడవాళ్ళను సైతం బానిసలు గా చేసుకున్న వైనం గగుర్పాటు కలిగిస్తుంది. వారి ని నగ్నంగా ఒక డెక్‌పైకి చేర్పిస్తారు. అనుక్షణం కొరడాలతో ఘోరాతిఘోరంగా చిత్రహింసలు అనుభవిస్తారు కుంటాతో సహా ఇతరులు.

ఊరి బయట ఒంటరిగా తిరగవద్దని తండ్రి చేసిన హితబోధ గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోతాడు కుంటా. తెల్లవాళ్లను హతమార్చాలని బందీలుగా ఉన్నవారి లో ఒక వర్గం ‘వొలోఫ్’ నాయకత్వంలో తిరుగుబా టు ప్రయత్నం చేసింది. ఆ ఘర్షణలో తెల్లవాళ్ళు నలుగురిని ‘వొలోఫ్’ హతమార్చినా, చివరకు తెల్లవాళ్ళ చేతుల్లో అతని మొండెం తెగక తప్పలేదు. ఆ మొండెం మీద తెల్లవాళ్లు తమ కసినంతా ప్రదర్శించి, తెగిన ఆ మొండాన్ని పచ్చడి చేశారు. ప్రతి తెల్లవాడిలోనూ కసి ఏ విధంగా తా రాస్థాయికి చేరుకుంది అని రచయిత వివరించా డు. అలా ఓడ నుంచి దింపిన ‘నిగ్గర్ల’ వేలంపాట మొదలయింది. నిగ్గరు అంటే బానిస అని అర్థం. అలా వేలం పాటలో కుంటాను ఓ తెల్ల యజమాని కైవసం చేసుకుంటాడు. వీరిలోనే కొందరు తెల్లవా ళ్ల తొత్తులుగా పనిచేసి పబ్బం గడుపుకునే నల్లవా ళ్లు కూడా ఉన్నారు. ఇలా వేలం పాటలో కొనుక్కు న్న నిగ్గర్లను తెల్లవాళ్ళు తమ పొలాల్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ కఠినంగా వాడుకుంటారు. అప్పటికీ కుంటా తప్పించుకుంటాడు. అయితే, తీవ్ర శిక్షణ పొందిన విశ్వాసం గలిగిన వేట కుక్కలు అతడిని పట్టుకుంటాయి. అలా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిగ్గర్లు మరింతగా చిత్రహింసలకు గురయ్యేవారు. గుర్రాల మీద కూర్చుని పనివాళ్ళ (బానిసలు)మీద పెత్తనం చెలాయించే ‘ఓర్సీ’ల చేతుల్లోని కొరడాలునిరంతరం కదులుతూనే ఉం టాయి. తెల్లవాళ్ళు తమ స్వా ర్థం కోసం రాసుకున్న చట్టం ప్రకారం తప్పించుకుని పారిపోయే వాడిని చంపవచ్చు.

నిగ్గర్లే తెల్లవాళ్ళు కూడపెట్టుకున్న పెద్ద ఆస్తి. బానిస వా డలో అనేక గుడిసెలు. వారిలో ఎందరో బానిసలు. వారి మధ్య పరిచయాలు.. అలా, కాలక్రమేణా తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు కుంటా. నిగ్గర్లల్లో ఒక్కొక్కడిది ఒక్కొక్క కథ, అంతులేని వ్యధ. అయి తే, తెల్లవాళ్లలోనూ కొద్దిగా మానవత్వం ఉందని, కుంటాను తన సొంత తమ్ముడి వద్దనుంచి కొనుగో లు చేసిన ఒక దొర వృత్తాంతం తెలుపుతుంది. ఈ నవలలో వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్.. ఇంకా మరికొన్ని ప్రాంతాలలోని బానిసల గురించి వివరించారు. అమెరికా పర్యటనలు చేసేవారికి ఈ ప్రాంతాలు సుపరిచితమే! నిగ్గర్లకు ఫిడెలయ్య అనే ఒక సీనియర్ నిగ్గర్ పరిచయం ఓ ఉపశాంతి. ఎన్నో విషయాలు, తన అనుభవాలను రంగరించి చెప్పేవాడు. చట్టాల గురించి కూడా వివరిస్తాడు. వాలన్ దొరతో రోజూ తిరిగి వచ్చే లూధర్ అనే నిగ్గరు కూడా పలు అనుభవాలను వెల్లడించేవాడు. లూదర్ చేసిన నమ్మక ద్రోహం వలన దొర తన డ్రైవర్‌గా కుంటాను నియమించుకున్నాడు. అతనిలో విశ్వాస పాత్రుడిని చూసాడు. డ్రైవర్ అంటే బగ్గీ తొలేవాడు. అలా దొరకు ప్రత్యేక నిగ్గరిగా కుంటాకు కొద్దిపాటి గుర్తింపు మొదలయింది.

దొర ఇంట్లో పనిచేసే ‘బెల్’ అనే తనకంటే వయస్సులో పెద్దదైన, అంతకు ముందు వివాహిత యై, ఇద్దరు పిల్లలున్న స్త్రీ మీద మనసు పడతాడు కుంటా. అతనికి స్త్రీ సాంగత్యం మీద కోరిక కలిగిం ది. వారికి కూతురు కలుగుతుంది. పేరు ‘కిజ్జీ’ అని పెడతారు. కిజ్జీకి వయస్సు వచ్చాక, నోవా అనే యువకుడిని తప్పించే ప్రయత్నంలో వాలర్ దొర ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుకు, కిజ్జీని బలవంతంగా అమ్మకానికి పెడతారు. తల్లి బెల్, తండ్రి కుంటా ఎంతగా ప్రాధేయపడినా దొర మ నసు కరగదు. కిజ్జీని కొనుకున్న కొత్త దొర ఆమెను బలవంతంగా చెరుస్తాడు. కిజ్జీకి గోధుమ రంగు ఛాయ కలిగిన కొడుకు పుడతాడు. కొడుకు పేరు ను దొరనే జార్జి అని నామకరణం చేస్తాడు. జార్జికి తల్లి కిజ్జీ తన తండ్రి గురించి ఆఫ్రికా తాతగా వివరిస్తుంది. జార్జిని దొర కోళ్ల ఫారంలో నియమిస్తాడు. వేరే దొర ఫారంలో పనిచేసే మెటిల్ డాతో జార్జి వివాహం అవుతుంది.

వారికి పుట్టిన కొడుకుకు వర్జిల్ అని పేరు పెట్టారు. ముత్తాత గురించి ఆ పిల్లవాడికి కూడా పసితనంలోనే ఆనందంగా వివరిస్తుంది కిజ్జీ. వాస్తవానికి దొర కూడా తాతనే అవుతాడు. జార్జి ఆరుగురు బిడ్డలను కంటాడు. ఆఖరు పిల్ల మేరీ. ఒక కొడుకు లిటిల్ జార్జ్, నాలుగో కొడుకు దొర తన పేరే పెట్టించాడు ‘టాం’ అని. చాలినంత డబ్బు వెనకేసుకుని, తాను, తన కుటుంబం బానిసత్వపు చెర నుంచి విముక్తి చెందాలని జార్జ్ ఆలోచన. సర్ రస్సెల్, దొర టామ్లెల మధ్య కోడిపుంజుల పందాల పోటీలు జరుగుతా యి. సర్వం కోల్పోయిన మాసా టామ్లె జార్జిని సర్ రస్సెల్‌కు నిగ్గరుగా అమ్మివేయడానికి ని శ్చయించుకుంటాడు. జీవిత ప ర్యంతం ఊడిగం చేసిన జార్జినీ అతని కుటుంబం నుంచి వేరుచేయ సిద్ధపడ్డాడు మాసా టామ్లె.

చివరకు దొర టామ్లె ఆస్తి మొత్తం కరిగి పోవడం వలన తన వద్దనున్న కొద్దిమంది నిగ్గర్లను మరో తెల్లవాడికి అమ్మకానికి పెడతాడు అతను. జార్జి కొడుకు టామ్ వివాహం ఇరీన్‌తో జరుగుతుంది. ఐదేళ్ళ అనంతరం పుట్టి పెరిగిన చోటుకు చేరుకున్న జార్జికి తనవాళ్ళు ఎవరూ కనపడరు. బానిస వాడ కూడా లేదు. కిజ్జీ చనిపోయింది. సర్వం కోల్పోయిన మాసా నిత్యం మత్తులో ఉం టుంటాడు. 1863లో బానిసలు అందరికీ స్వేచ్ఛ ప్రసాదిస్తూ అబ్రహాం లింకన్ ప్రకటించాడు. నవల చివరిలో పరిశోధనల కోసం ఆఫ్రికాలోని గాబ్రి యా (కుంటా జన్మస్థలం), కింటీ (కుంటా తండ్రి) వంశ వృక్షం చరిత్ర తెలిసిన ఇతిహాసుడిని వెతికే పనిలో నిమగ్నం కావడం హార్ట్ టచింగ్‌గా ఉంది. ‘మా ఏడు తరాల కింటే వంశ మూల పురుషుడు కుంటా పుట్టి పెరిగిన జపూర్ గడ్డమీద కాలిడిన క్షణం ఓ అతీత అనుభవం’ అని చెపుతాడు ఆ వంశానికే చెందిన రచయిత.

ఒక వృద్ధుడు ఆ వంశ చరిత్ర అద్భుత కథనంగా వివరించిన విధానం మంచి ముగింపు. గాంబియా నుంచి బానిసలను ఎక్కించుకున్న ఓడకు నాప్లిన్ అనే చోట లంగరు దించారు. ‘ఏడు తరాలు’ (రూట్స్) రచయిత ‘అలెక్స్ హేలీ’ కుంటా వంశానికి చెందినవాడు. వంశ మూల పురుషుడి పుట్టు పూర్వోత్తరా లు వెతికి వెలుగులోకి తీసుకురావాలనే సంకల్పం ఆయనకు 1962లో కలిగింది. అందుకోసం 12 సుదీర్ఘ సంవత్సరాలు ఎడతెగని పరిశోధనలు చేసి దానిని ‘రూట్స్’గా వెలుగులోకి తెచ్చాడు.
మాటల్లో చెప్పలేనంత అత్యద్భుత నవల ఈ ‘ఏడు తరాలు’ (రూట్స్).
పంతంగి శ్రీనివాసరావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News