Sunday, June 1, 2025

విద్యార్థుల వీసాల విలాపం

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో విదేశీ, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. వీసా రద్దు చేయడం, ఒపిటిపై ఆంక్షలు విధించడం, ఫెడరల్ నిధుల కోతలు వంటివి ఆందోళనకు దారితీస్తున్నాయి. తాజాగా విద్యార్థుల వీసాల ఇంటర్వూలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతోందని, చైనా కమ్యూనిస్టు పార్టీతో కొంతమంది విద్యార్థులకు సంబంధాలు ఉంటున్నాయని ఇలా అనేక ఆరోపణలపై అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అయితే ఈ పరిశీలనకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా అధికార యంత్రాంగం ప్రకటించింది. వీసాకు దరఖాస్తు ఫారమైన డిఎస్ 160 ద్వారా 201112 నుంచే సోషల్ మీడియా ఖాతాలను అడుగుతున్నారు. అయితే దరఖాస్తుదారుల ఖాతాలన్నిటినీ వేగంగా తనిఖీ చేసే విధానం ఇంకా లేకపోవడంతో ఎప్పుడు వీసాల ఇంటర్వూలు ఉంటాయో తెలియడం లేదు.

అమెరికా యూనివర్శిటీలు ఆగస్టు డిసెంబర్, జనవరి మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. సాధారణంగా భారతీయ విద్యార్థులు ఆగస్టు డిసెంబర్ సెమిస్టర్‌నే ఎంపిక చేసుకుంటారు. దీంతో ఆరునెలల ముందునుంచే వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. విద్యార్థులకు ఇచ్చే ఎఫ్1వీసాను నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో పూర్తికాలం విద్యకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. 2023 లో 1.03 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు (Visas students) అందగా, 202324 లో ఎఫ్1 వీసాలను భారీగా తగ్గించారు. 2024లో మొదటి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38% మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ ఏడాది తొలి సెమిస్టర్ కోసం దాదాపు 78 వేల మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 24 వేల మందికి ఇంటర్వూ తేదీలు వచ్చాయి. కొందరికి ఇంటర్వూలు జరిగాయి.

ఇందులో 6 వేలమంది వివిధ కారణాలవల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54 వేల మంది ఇంటర్వూ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా అనుసరించే సోషల్ మీడియా వెట్టింగ్ విధానం విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియపై పెను ప్రభావం చూపనుంది. అంతేకాదు అమెరికా యూనివర్శిటీలపై ఆర్థిక భారం కూడా పడుతుంది. భారత్ నుంచి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికాకే వెళ్తున్నారు. మన విద్యార్థులు చదువుకోసం ప్రతి ఏటా రూ. లక్ష కోట్లు చెల్లిస్తున్నారని భారత విదేశీ మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఏటా భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల్లో 40 వేల నుంచి 50 వేల మంది తెలుగువారే ఉండేవారు. అయితే అక్రమ వలసదారులను పట్టుకుని తిరిగి పంపించడం ప్రారంభించాక పార్ట్‌టైమ్ చేస్తున్న భారత విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ఏటా వెళ్లే వారిలో 50% అమెరికా చదువులను వాయిదా వేసుకోవలసి వచ్చింది. గత ఏడాది 2.7 లక్షలకు పైగా భారత విద్యార్థులు అమెరికాలో నమోదయ్యారు.

దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 43.8 బిలియన్ డాలర్ల (రూ. 3,73,982 కోట్లు) ఆదాయం సమకూరింది. 202324లో 10 లక్షలకు పైబడిన విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు దాదాపు 4400 కోట్ల డాలర్ల సంపద సొంతమైంది. 3.78 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమైంది. అమెరికా వర్శిటీల్లో చదువుకున్న విదేశీయుల్లో చాలా మంది అక్కడే స్టార్టప్‌లు, ఇతర వ్యాపారాలు నెలకొల్పుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అమెరికాలో చదువుకున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు మొదటి స్థానంలోను, చైనీయులు రెండో స్థానంలోను ఉన్నారు. 2023 24 సంవత్సరంలో చైనా నుంచి 2 లక్షల 70 వేలమంది విద్యార్థులు అమెరికా చదువులకు వెళ్లారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో నాలుగోవంతు చైనీయులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వూలను తాత్కాలికంగా నిలిపివేయడంపై చైనా స్పందించింది. అంతర్జాతీయ విద్యార్థులతో సహా చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరింది.

ఇరుదేశాల మధ్య విద్యాపరమైన విషయాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పైన, వారి ట్యూషన్ ఫీజుల పైన ఆధారపడిన అమెరికా విశ్వవిద్యాలయాలకు ట్రంప్ సర్కారు విధానాల వల్ల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఇటీవలే హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై ట్రంప్ సర్కారు నిషేధం విధించడం లక్షలాది మంది విద్యార్థుల కలలను చెరిపివేస్తోంది. ఇంతేకాకుండా క్లాసులకు గైర్హాజరైతే వీసాలు రద్దంటూ మరో కఠోర నిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అమెరికాలో సగటు భారతీయ విద్యార్థి పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారతదేశంలో విద్యార్థులు చదువులకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం మాజీ సభ్యుడైన అజయ్ భుటోరియా తాజా పరిణామాలపై స్పందిస్తూ కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఇంటర్వూలను అమెరికా నిలిపివేయడం ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. ఎంతో మంది భారతీయ విద్యార్థుల చదువుల కలలను భగ్నం చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News