గుజరాత్లో గతవారం జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం క్షణాల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో బయటికొచ్చింది. ఈ ప్రమాదం జరిగిన భవనం లోని విద్యార్థులు ప్రాణభయంతో బాల్కనీ నుంచి కిందకు దూకిన దృశ్యాలవి. జూన్ 12 మధ్యాహ్నం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం కాసేపటికే విమానాశ్రయం సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఈ భవనం లోని విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.
కొందరు విద్యార్థులు రెండు మూడు అంతస్తుల్లోని బాల్కనీల నుంచి బెడ్షీట్లు, తాళ్ల సాయంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. భవనానికి ఒక వైపు ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగగా, మరోవైపు నుంచి వీరు కిందకు దూకుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఈ ప్రమాదం కారణంగా విమానం లోని 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక భవనంపై కూలడంతో ఈ హాస్టల్ లోని పలువురు మెడికోలు, సిబ్బంది సహా మరో 33 మంది మృత్యువాత పడ్డారు. మధ్యాహ్న సమయం కావడంతో విద్యార్థులంతా భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.