ప్రపంచంలో ప్రస్తుతం మూడు యుద్ధాలు బీభత్సంగా సాగుతున్నాయి. ఈ యుద్ధాల వెనుక అమెరికా వ్యూహం ఉందన్న సంగతి జగమెరిగిన సత్యం. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దాడిలో ఉక్రెయిన్కు గత బైడెన్ ప్రభుత్వం అండదండలు అందించగా, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉక్రెయిన్ను బెదిరించి తన దారిలోకి ట్రంప్ తెచ్చుకున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణే కాదు, మళ్లీ యుద్ధం జరగకుండా సంధి కుదురుస్తానని ట్రంప్ బీరాలు పలికినా రష్యా తలొగ్గలేదు. ఫలితంగా ఆ రెండు దేశాల మధ్య పోరు సాగుతూనే ఉంది. ఇక గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో ఇజ్రాయెల్కు ట్రంప్ సహకరిస్తున్నారు. గాజాలో ఆకలి చావులు పెరిగిపోతున్నా బాధితులకు ఆహారం అందించే సహాయం కూడా ఇజ్రాయెల్ చేయడం లేదు. ఐక్యరాజ్య సమితి తరఫున అందించే ఆహార పదార్ధాలను కూడా గాజాకు చేరనీయడం లేదు. ఈ అమానుషకాండ గురించి ట్రంప్ ఏమాత్రం ఖండించడం లేదు సరికదా హమాస్ ఉగ్రవాదుల నుంచి రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని, అందుకు ఏదైనా చేస్తుందని ట్రంప్ వత్తాసు పలుకుతున్నారు.
గత ఆరు రోజులుగా ఇరాన్పై ఇజ్రాయెల్ సాగిస్తున్న బీభత్స యుద్ధం వెనుక ట్రంప్ వ్యూహం కొనసాగుతోంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందన్న సాకుతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. కానీ అమెరికా నిఘా సంస్థల దర్యాప్తు ప్రకారం ఇరాన్ అణ్వాయుధాల (Iran nuclear weapons) తయారీకి గత మూడేళ్లుగా దూరంగానే ఉంటోందని, అణు నిల్వలు సమృద్ధిగా ఉన్నా ఏ దేశంపై కూడా దాడులు చేయాలన్న ఆలోచనలో ఇరాన్ లేదని వెల్లడైంది. శాంతియుత ప్రయోజనాలకు అణుశక్తిని వినియోగించే హక్కు తమకు ఉందని, అందుకు కట్టుబడి అణుశుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఇరాన్ వాదిస్తోంది. అయినా ఇజ్రాయెల్ ఆగడం లేదు. ఇరాన్ ఏ క్షణంలో ఏ ముప్పు చేస్తుందో అన్న భయంతోనే దాడులు కొనసాగిస్తోంది. రెండు మూడు నెలలనుంచి ఇరాన్ పాలకవర్గం అణు ఒప్పందానికి రావాలని ట్రంప్ పిలుపునిస్తున్నారు. కానీ ఇరాన్ ప్రభుత్వానికి అమెరికాపై నమ్మకం కుదరడం లేదు.
అయినా చర్చలు ప్రారంభమయ్యాయి. ఆరవ దఫా చర్చలు జూన్ 15 ఆదివారం ఒమన్ రాజధాని మస్కట్లో జరగాల్సి ఉంది. ట్రంప్ పెట్టిన షరతులకు ఇరాన్ తలవంచకపోవడంతో ట్రంప్కు సానుకూలమైన సమాధానం ఇరాన్ నుంచి రాలేదు. కానీ అంతకు రెండు రోజులముందే ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు ప్రారంభం కావడం గమనార్హం. ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూ మరోవైపు ఇజ్రాయెల్ను ఇరాన్పై ఎగదోయడంలో ట్రంప్ కపటనాటకమేమిటో సులువుగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో కల్లోలం సృష్టిస్తున్నది ఇరాన్ అని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కోసమే దాడులని వక్ర భాష్యం ట్రంప్ చెబుతున్నారు. మరి ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇరాన్ను ఆత్మరక్షణ లోకి నెట్టేయడం ఏం సబబు. ఇజ్రాయెల్ చర్యలన్నీ తనకు తెలుసని అంటూనే, తనకు చెప్పకుండానే నెతన్యాహు దాడులకు పాల్పడ్డాడని ట్రంప్ బుకాయిస్తున్నారు.
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లోని అణుశక్తి వనరులన్నీ ధ్వంసమయ్యాయి. తొమ్మిది మంది అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్తలు, పలువురు మిలిటరీ కమాండర్లు నేలకొరిగారు. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు ఆపాలని సూచిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, కానీ అంతం చేయకముందే లొంగిపోవడం మంచిదని ట్రంప్ ఏకపక్షంగా హెచ్చరించడం ఎవరికోసం. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి పెద్దరికం వహించాల్సిన ట్రంప్ ఒక దేశాన్ని హెచ్చరిస్తూ మరో దేశానికి కొమ్ముకాయడం ప్రపంచ దేశాలన్నీ ఆక్షేపిస్తున్నాయి. ఇరాన్ కూడా ఆగడం లేదు ప్రతిదాడులు భీకరంగా సాగిస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు ఇప్పటికే చిల్లులు పడడంతో ఇరాన్ ప్రయోగించే క్షిపణులు ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలకు దూసుకొస్తున్నాయి.
వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేయవలసి వస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ కోసం ఒక్క రాత్రికి ఏకంగా 285 మిలియన్ డాలర్ల మేర (భారత కరెన్సీలో దాదాపు రూ. 2400 కోట్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి సాయం అందకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ 1012 రోజుల్లోనే క్షీణిస్తుందని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య దాడులు మంగళవారం నాటికి ఐదో రోజు చేరుకోవడంతో కెనడాలో జి7 అగ్రనాయక సమావేశం నుండి మధ్యలోనే హడావిడిగా ట్రంప్ వాషింగ్టన్కు ప్రయాణమయ్యారు. వెంటనే సిచువేషన్ రూమ్కు చేరుకుని ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్పై ప్రత్యక్ష దాడులకు సన్నాహాలు చేయడం ముఖ్యంగా గమనించాల్సి ఉంది.
అలాగే సిచువేషన్ రూమ్ నుంచి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుతో గంటసేపు ఫోన్లో మాట్లాడడం విశేషం. ఇజ్రాయెల్ను, ఇరాన్ను చర్చల పేరుతో తన కాళ్ల వద్దకు రప్పించుకుని యుద్ధ విరమణకు ప్రయత్నించే శాంతిదూతగా ప్రచారం చేసుకోవాలన్నది ట్రంప్ ఎత్తుగడ. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తి లేదని ట్రంప్కు ఖమేనీ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపితే కానీ యుద్ధం సమాప్తం కాదని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించారు. ట్రంప్ కూడా సద్దాం హుస్సేన్కు పట్టిన గతే ఖమేనీకి పడుతుందని హెచ్చరించారు. పశ్చిమాసియా కల్లోలంలో కకావికలు కాకుండా ఇరుదేశాలూ తక్షణం యుద్ధం ఆపాలని చైనా, రష్యా, టర్కీ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి చేయడం వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రష్యా హెచ్చరించింది.