న్యాయవాద దంపతులు గట్టు వామన్రావ్, నాగమణిల హత్య కేసును మంగళవారం సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వామన్రావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా, మంథని మండలంలోని గుంజపడుగ. 2021లో పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామ శివారులో ఈ న్యాయవాద దంపతులు వెళ్తున్న కారును అడ్డగించి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంచలనం సృష్టించింది.
మన తెలంగాణ/మంథని రూరల్: నాయ్యవాద దంపతు లు గట్టు వామన్రావ్, నాగమణిల హత్య కేసును సుప్రీం కోర్టు సిబిఐకి అప్పగించింది. మంథని మండలంలోని గుంజపడుగ గ్రామం కాగా 17 ఫిబ్రవరి 2021లో పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామ శివారులో న్యాయవాద దంపతులు వెళుతున్న కారును అడ్డగించి నడిరోడ్డుపై ఇరువుర్ని దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చిన సంఘటన రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంచలనం సృష్టించింది. కేసులో పలువుర్ని అరెస్టు చేయగా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అయితే కేసును సిబిఐకి అప్పగించాలని వామన్రావ్ తండ్రి కిషన్ రావ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్కె సింగ్లాల ధర్మాసనం పిటిషనర్ను విచారించి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబందించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. ఈ లోగా కేసును సిబిఐకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు మరణవాంగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తు చేయాలని సిబిఐను న్యాయస్థానం ఆదేశించింది. సిబిఐ విచారణలో వాస్తవాలు అన్ని వెలుగులోకి వస్తాయనే నమ్మకం తమకు ఉందని వామన్రావ్ తండ్రి కిషన్రావ్ తెలిపారు.
అసలు దోషులకు శిక్ష పడాలి: శ్రీధర్ బాబు
గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసు సిబిఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు దోషు లు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.