ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలి పరువుకు నష్టం కలిగించే వీడియోను ప్రచారం చేసిన కేరళకు చెందిన జర్నలిస్టు నందకుమార్ టిపిని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. నందకుమార్ తన యూట్యూబ్ ఛానెల్ “ క్రైమ్ ఆన్లైన్” పై వీడియో ప్రసారం చేయడాన్ని తప్పు పట్టింది. “మీ యూట్యూట్ వీడియోల ఆధారంగా ప్రజలను దోషులుగా చేయాలనుకుంటున్నారా ? యూట్యూబ్ ఆధారంగా దోషి లేదా నిర్దోషి నిర్ధారణ కారు. ఆ పని కోర్టులు చేస్తాయి.” అని జస్టిస్లు బివి నాగరత్న, కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. “ యూట్యూబ్లో ఏదైనా మంచి విషయం చెప్పండి. ఎందుకు ఈ క్రైమ్ఆన్లైన్ పెట్టారు ? కేరళలో ఏదైనా మంచి జరుగుతుంటే దాని గురించి మాట్లాడండి ” అని ధర్మాసనం సూచించింది.
అగ్ర న్యాయస్థానం ఈలోగా జర్నలిస్టు నందకుమార్ ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ను కోరగా, కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరును పొడిగించింది. మహిళ నిరాడంబరతను అవమానించడం, బెదిరింపులు, ఎలక్రానిక్గా అశ్లీల కంటెంట్ను వ్యాప్తి చేయడమే కాకుండా, గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉండడంపై భారతీయ న్యాయసంహిత నిబంధనల ప్రకారం నందకుమార్ అరెస్టు అయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 67 ప్రకారం కూడా కేసు నమోదైంది. నందకుమార్కు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడానికి కేరళ హైకోర్టు జూన్ 9 న నిరాకరించడమే కాక, పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ నందకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.