తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణి బుధవారం నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ మరమ్మతు పనులు టిటిడి జూలై 20 తేదిన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్వర్క్స్ విభాగంలోని దాదాపు 100 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు.
అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగులు (పెయింటింగ్) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మతు పనులు పూర్తిచేశారు. అయితే స్వామి పుష్కరిణి మరమ్మతు పనుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పుష్కరిణి హారతిని టిటిడి నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. బుధవారం నుండి భక్తులను పుష్కరిణీలో అనుమతించారు.