అమరావతి: తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని ముందే చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాదైందన్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని బాబు తెలిపారు. 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నామని, దీని కోసం పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. సంపద సృష్టించడంతోపాటు ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పామని, పెంచిన ఆదాయాన్ని, అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగిస్తున్నాన్నారు.
మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. తల్లిలేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం మాకు రెండు కళ్లు అని, అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని బాబు హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికీ రూ.15 వేల ఆర్థికసాయం చేస్తున్నామని, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరనుందని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల నగదు జమ చేస్తామని, ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు ఉంటుందని, స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం మినహాయించిన నిధులను వినియోగిస్తామని చంద్రబాబు వివరించారు.