మూడు విడతల్లో 593 మండలాల్లో
10,725 రెవెన్యూ సదస్సులు
అధికారులతో సమీక్షలో రెవెన్యూ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యలకు సంబంధించి మూడు దశల్లో దాదాపుగా 8.58 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 14వ తేదీన భూ భారతి చట్టాన్ని ఆవిష్కరించుకున్నామని, నాటి నుంచే రెవెన్యూ వ్యవసస్థలో నూతనశకం ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ చట్టాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో మంత్రి శనివారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా బిఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిందని, విధ్వంసమైన వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో భూ భారతికి ముందు భూ భారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. నాటి ప్రభుత్వం ఎంతో గొప్పగా 2020లో తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టాన్ని తిరగరాసి పారదర్శక పాలనకు పెద్ద పీట వేస్తూ రైతులు కష్టాలు తీర్చడమే ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పదేళ్లలో రైతులు పడ్డ కష్టాలు, బాధలు ఏ విధమైన సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అత్యధికం ఖమ్మంలో
మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12వేల దరఖాస్తులు, తర్వాత రెండో దశలో మే 5వ తేదీ నుంచి 28 మండలాల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందులో సాదాబైనామాల అంశం మినహా సుమారు 60 శాతం పైగా సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూ సమస్యలకు సంబంధించి 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.
అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67 వేలు, భద్రాద్రి కొత్తగూడెం 61 వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48 వేలు, నల్గొండ 42 వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు. రెవెన్యూ సదస్సులకు ముందు రోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితంగా దరఖాస్తులను ఇచ్చామని, ఎమ్మార్వో ఆధ్వ ర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఎలాంటి రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరించారన్నారు. స్వీకరించిన వాటికి రశీదులను అందచేసినట్లు చెప్పారు. దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.