తెలంగాణ ఆకాంక్షల కోసం ఎన్నో వందల మంది పరితపించారు. మరెంతో మంది సర్వస్వాన్ని ఒడ్డి పనిచేశారు. తెలంగాణ రాష్ట్రసాధన ధ్యేయంగా వేలమంది యువకులు రక్తతర్పణ చేశారు. ప్రాణాలను కూడా బలిపెట్టారు. అయితే అందులో ఏదో ఒక సమయంలో పనిచేసిన వారే. కొంతమంది నాన్ ముల్కీ గోబ్యాక్ అని నినదిస్తే, మరి కొంత మంది 1969 ఉద్యమంలో సింహాల్లాగా ముందుకు దూకారు. లక్షల మంది మలి దశ ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని అందజేశారు. అయితే కొద్దిమంది మాత్రమే అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందులో జయశంకర్ సార్ ఒకే ఒక్కడు. జయశంకర్ సార్ తెలంగాణ శ్వాస, ధ్యాస ఆశగా, ఆకాంక్షగా ఏకైక లక్షంగా తన మొత్తం జీవితాన్ని సాగించారు. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అస్తిత్వాన్ని తన జీవన గమనంగా, గమ్యంగా మార్చుకున్నవారు జయశంకర్ సార్.
దాదాపు పదిహేనేళ్ళ సాహచర్యం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. 1992 సంవత్సరం జనవరి నుంచి ఆయన చివరి శ్వాస వరకు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నాకు ఆయన వ్యక్తిత్వం గొప్ప స్ఫూర్తి. జయశంకర్ సార్ 1934 సంవత్సరం ఆగస్టు 6వ తేదిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారు. 1934 సంవత్సరం నుంచి ఆయన విద్యార్థిగా, తెలంగాణ చైతన్య ప్రతీకగా ఎదగడం మొదలుపెట్టాక 1952 వరకు తెలంగాణ ఒక పోరాటాల కార్యక్షేత్రంగా ఉన్నది. అప్పటి విద్యావంతుల ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభ, తర్వాత కమ్యూనిస్టు పార్టీగా మారి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన సందర్భం అది. మరొక సారి కాంగ్రెస్ పార్టీగా మారి సత్యాగ్రహ ఉద్యమాలను నిర్వహించడం జరుగుతున్న సమయమది.
మరోవైపు ఆర్యసమాజ్, సోషలిస్టు సంస్థ నిజాం వ్యతిరేక ఉద్యమాలు నిర్వహిస్తున్న కాలమది. సరిగ్గా ఆ సమయమలోనే జయశంకర్ సార్ ఎదిగారు. అందుకే ఆయన ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడే తిరుగుబాటు భావాలను తనకు తెలియకుండానే సొంతం చేసుకున్నారు. హన్మకొండలోని మర్కజ హైస్కూల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఆయన చైతన్యానికి ప్రారంభం. ఒక రోజు పాఠశాలలో ప్రార్థన సమావేశం ముగిసింది. అందరూ పిల్లలు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి (School principal) ఆదాబ్ అని చెప్పడం ఆనవాయితీ. కానీ జయశంకర్ అనే విద్యార్ధి వందేమాతరం అని చెప్పాడు. అయితే అప్పటి ప్రిన్సిపాల్ జయశంకర్ను తన రూంకు పిలిచి, ఇప్పుడు నువ్వు ఏమని సంబోధించావని అడిగారు. దానికి జయశంకర్ సమాధానమిస్తూ, “వందేమాతరం అని అన్నాను” అని బదులిచ్చారు. దానికి అర్థం తెలుసా అని మళ్ళీ ప్రశ్నించారు.
నాకు తెలియదు అని సమాధానం. ఆ మరుసటి రోజు జయశంకర్ సార్ తండ్రి లక్ష్మికాంతరావును పిలిచి, విషయం చెప్పి భవిష్యత్లో ఇట్లా జరగకుండా చూసుకోండని ప్రిన్సిపాల్ చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో వందేమాతరం, విప్లవం అని నినదించినా, ప్రస్తావించినా పెద్ద నేరం. జయశంకర్ సార్కు ఆ సంఘటన జరిగిన నాడు ఎటువంటి అవగాహన లేదు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం పలకరించుకునే విధానం అది. అయితే ఆయన ఇంటర్ చదువుతున్న రోజుల్లో అంటే 1952 మరొక ఉద్యమానికి తెలంగాణ సిద్ధమైంది.అప్పటికే తెలంగాణ సీమాంధ్ర ఉద్యోగులతో నిండిపోయింది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారత సైన్యాలు హైదరాబాద్ను ఆక్రమించుకొని, దేశంలో విలీనం చేసిన తర్వాత నిజాం ఉద్యోగాల స్థానంలో తెలుగు, ఇంగ్లీషు వచ్చిన ఉద్యోగులను నింపారు. ఇది అప్పటి ఉద్యోగుల్లో, యువతలో అసంతృప్తిని నింపింది. దానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే నాన్ ముల్కీ గో బ్యాక్.
ఇందులో జయశంకర్ సార్ పాల్గొనడమే కాకుండా, వరంగల్ విద్యార్థుల్లో ముఖ్యుడుగా ఎదిగారు. హైదరాబాద్లో సిట్ కాలేజీ విద్యార్థులపై జరిగిన కాల్పుల రోజు వరంగల్ నుంచి బయలుదేరిన బృందంలో జయశంకర్ సార్ ఉన్నారు. ఆ తర్వాత డిగ్రీ చదువుతున్న రోజుల్లో 1955లో అప్పటి రాష్ట్ర పునర్వవస్థీకరణ సంఘాన్ని కలిసిన విద్యార్ధి బృందంలో జయశంకర్ సార్ ముఖ్యులు. హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రాంతం తో కలపడం తెలంగాణకు నష్టం జరుగుతుందని వాదించిన యువ నాయకుడు మన జయశంకర్ సార్. ఆ తర్వాత ఆయన ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసుకొని ఉపాధ్యాయుడుగా చేరారు. అయితే ఆనాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని విడదీసి, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిసి, ఆంధ్రప్రదేశ్గా 1956లో మార్చారు. అయితే అప్పటికే హైదరాబాద్ రాష్ట్రం మిగుల బడ్జెట్ కలిగిన రాష్ట్రం.
కానీ హైదరాబాద్లో వచ్చిన ఆదాయం ఇక్కడి ప్రజల అవసరాలకే ఖర్చు చేస్తామని చేసిన నిర్ణయాన్ని ఉల్లంఘించి ఆంధ్ర ప్రాంతానికి తరలించిన విషయం అప్పుడు పెద్ద చర్చగా మారింది. దీని మీద విచారణ జరపాలని తెలంగాణ ప్రజలు చేసిన డిమాండ్కు అనుగుణంగా అప్పటి ప్రబుత్వం లలిత్, భార్గవ్ కమిటీలను నియమించింది. నిర్దిష్టమైన అధ్యయనంతో 1969లో ఆ కమిటీ ముందు జయశంకర్ సార్ హాజరై తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలిపోతున్న విషయాలను సోదాహరణంగా వివరించారు. 1969 ప్రథమార్థ భాగంలో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో అనేక మంది విద్యావేత్తలతో కలిసి తెలంగాణ వివక్షకు గురవుతున్న విషయాన్ని అనేక రంగాల్లో చేసిన పరిశోధనలతో ఒక సెమినార్ను నిర్వహించారు.
అందులో కూడా అప్పటి ప్రొఫెసర్ ఆనందరావుతో కలిసి జయశంకర్ సార్ చేసిన కృషి ఆనాటి ఉద్యమానికి ఒక ఆయుధంగా పని చేసింది. ఆ తర్వాత ఇవే విషయాలను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వివరించడానికి వెళ్లిన బృందంలో జయశంకర్ సార్ ఉన్నారు. ఈ ఉద్యమానికి ఆనందరావు, జయశంకర్ సార్ కొన్ని నిర్దిష్టమైన అవగాహనను ఏర్పరచుకున్నారు. ఆ అవగాహనే 1996 లో ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి మార్గనిర్దేశం చేసింది. అదే ఆయన త్రి సూత్రం. అందులో మొదటి భావజాల వ్యాప్తి, రెండోది ప్రజా ఉద్యమం, మూడోది రాజకీయ ప్రక్రియ. 1969 ఉద్యమంలో భావజాల వ్యాప్తి, ప్రజా ఉద్యమం ప్రభావం ఉన్నది. కానీ రాజకీయ ప్రక్రియలో ద్రోహం జరిగిందని ఆయన భావించారు. అందుకే మలిదశ ఉద్యమంలో ఆయన తన ఆలోచనలను, ఆచరణను రాజకీయ ప్రక్రియ వైపు ఎక్కువగా దృష్టి సారించారు.
ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలను ఈ విషయం వైపు మళ్లించకుండా విజయం సాధించలేమని ఆయన భావించారు. అందరికీ బోధించారు. అందుకే మలి దశ ఉద్యమం రాజకీయ పార్టీల లక్షంగా సాగింది. ఈ రోజు తెలంగాణ కల సాకారం కావడానికి ఇది ప్రధానమైన కారణం. మరొక ముఖ్యమైన సైద్ధాంతిక ఆలోచన ఉద్యమ నిర్వహణ. ఆయనకు లక్షం ముఖ్యమైనది. ఆ లక్షం కోసం ఎవ్వరు ముందుకు వచ్చినా వారితో కలిసి పని చేయాలనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు తనకు అందరూ ఒక్కటేననే విషయాన్ని బలంగా నమ్మారు. అందుకే ఆయన అన్ని ప్రాంతాలతో, సంఘాలతో కలిసి పని చేశారు. 196972 మధ్య కాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయిన తర్వాత కూడా జయశంకర్ సార్ తన అధ్యయనాన్ని ఆపలేదు.
ఆయన హన్మకొండలోని సికెఎం కళాశాలలో ప్రన్సిపాల్గా, సీఫెల్ రిజిస్ట్రార్గా, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా పని చేసిన సమయంలో కూడా తన ఆలోచలనలను పక్కకు తిప్పలేదు. ఇంకొక విషయంపైన తన దృష్టి మరల్చలేదు. 1987లో కొంత మంది విద్యావేత్తలు ప్రారంభించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్తో కూడా ఆయన తన భాగస్వామ్యాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 1996 ఆగస్టు 15వ తేదీన అప్పటి ప్రధాని దేవెగౌడ్ చత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో మళ్లీ తెలంగాణలో కదలిక మొదలైంది. ఈ క్రమంలో 1996 అక్టోబర్ 27వ తేదీన నిజామాబాద్ జిల్లాలో 25 మందితో ఒక సమావేశం జరిగింది. దానికి జయశంకర్ సార్ అతిథిగా హాజరైనారు. ఆయన మన నుంచి వెళ్లిపోయిన 2011 సంవత్సరంలో వరంగల్లో జరిగిన సభ 25 లక్షల మందితో జరిగింది.
25 మందితో 1996లో ప్రారంభమైన ఉద్యమం 25 లక్షల మందితో సమీకృతమైంది. 25 మందితో మాట్లాడిన అదే వ్యక్తి, 25 లక్షల మంది సభలో మాట్లాడడం అరుదైన గౌరవం. జయశంకర్ సార్ 1952లో విద్యార్థి నాయకుడుగా తన తెలంగాణ చైతన్యాన్ని గుండెలో నింపుకొని 2011 జూన్ 21వ తేదీన ఈ నేలను చివరి సారిగా భౌతికంగా వదిలిపెట్టినప్పటి వరకు ఆయన నిరంతర ఆలోచన, అధ్యయనం, ఆచరణ అంతా తెలంగాణ.తెలంగాణలో కాని, మరే ప్రాంతంలో కాని ఒకే విషయంపైన జీవితాంతం పని చేసిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆయన ఏది మాట్లాడినా, రాసినా, వాదించినా సాధికారికంగా అంటే ఆధారాలు ఉండాలని నమ్మినవారు. అంతేకాకుండా ఏ విషయంలో కూడా ఘర్షణ, హింసను ఆయన ఏనాడు ప్రబోధించలేదు. ఆయన క్యాన్సర్తో బాధపడుతున్న సమయంలో కూడా వీలైతే సమావేశాల్లో పాల్గొనేవాడు.
నేను తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడుగా ఉన్న సమయంలో వరంగల్లో జరిగిన జిల్లా సభలకు అతిథిగా హాజరై ఆయన చేసిన ప్రసంగం అన్ని ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలకు ఒక మేనిఫెస్టో. ఇది 2011 సంవత్సరం. తెలంగాణ ఉద్యమంలో చాలా సంఘాలు, సంస్థలు, పార్టీ భాగస్వామ్యంగా ఉన్నారు. ఇందులో కొన్నిసంఘాలు కలిసి ఉమ్మడిగా పని చేస్తున్నాయి. మరి కొన్ని విడివిడిగా ఉన్నాయి. దానిని ప్రస్తావిస్తూ, ఉద్యమాలు సంఘటితంగా, సమైక్యంగా జరగాలి. అది ఒకవేళ కుదరదంటే ఒకరికొకరు సహకరించుకోవాలి. అది కూడా సాధ్యం కాకుంటే సమన్వయంతో పని చేయాలి. అది కూడా అసాధ్యమైతే సంఘర్షణ లేకుండా సమాంతరంగా పని చేయాలి” అని ఆనాటి ఉద్యమానికి ఉద్యమ గీతి వినిపించారు. ఇట్లా రాసుకుంటూపోతే ఎక్కడ ఆపాలో తెలియదు. ఈ రోజుకు 14 సంవత్సరాలు కావస్తున్నది. ఆయన మనతో భౌతికంగా లేకపోయినా ఆయన ఆలోచన, ఆచరణ, అనుభవం మనకు ఎల్లప్పుడు మార్గదర్శకాలే.
- మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- (నేడు జయశంకర్ 14వ వర్ధంతి)