తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి పదకొండు ఏండ్లు పూర్తి చేసుకొని నేడు 12వ ఏట ప్రవేశిస్తోంది. ఇందులో ప్రజాపాలన నినాదంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పదహారు నెలలు నిండాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తన ఏడాదిన్నర పాలనలో చెప్పుకోదగ్గ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల్లు పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ గ్యారంటీలలో ఒకటైన యువ వికాసం పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామంటూ ఒక్కో హామీని అమలు చేస్తూ తన మాట నిలబెట్టుకుంది. ఇందులో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా పథకాల ఫలాలను ప్రజలు ఇప్పటికే అందుకున్నారు.
యువ వికాసం పేరుగల పథకం నిరుద్యోగుల పాలిట వరంగా కాబోతున్నది. తన ప్రజాపాలనలో నిరుద్యోగ యువతకు నిరంతర ఉద్యోగాల కల్పనతో కాంగ్రెస్ ప్రభుత్వం వారిలో చెరగని ముద్ర వేసింది. మహిళలకు ఉచిత బస్సు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలెండర్, రైతన్నకు భరోసా, ఒక్కో రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వంటి స్కీములను విజయవంతంగా అమలు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన రాజీవ్ యువ పథకానికి రాష్ట్ర ఆవిర్భావ శుభ దినాన శ్రీకారం చుట్టబోతున్నది. ఈ పథకం ద్వారా మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించబోతున్నది. ఇందులో రూ. 50 వేలు తిరిగి చెల్లించనవసరం లేకుండా ఈ పథకాన్ని రూపొందించింది. ఇదివరకే పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, సన్న వడ్లకు రూ. 500 బోనస్సు వంటివి ఎన్నో కార్యరూపం దాల్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వియవంతంగా అమలు చేసిన పథకాల కథ కమామిషు క్లుప్తంగా…
బడుగులకు ఓ గూడు!
మనతెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన సాధ్యమైనన్నీ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్లాబ్, గోడలు పూర్తి చేసుకొని తుదిదశలో ఉన్న ఇళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోం ది. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి, మొత్తం 47,377 మందికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతి పత్రాలు అందించగా, ఇందులో 23,847 మంది నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. వీటిలో తుది దశకు వచ్చిన ఇళ్లను జూన్ 2వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్రెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ ఇళ్లను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మిగతా పనులను వేగవంతంగా చేయడానికి ప్రతి సోమవారం నిధులను లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తోంది.
మార్చి 2024లో పథకం ప్రారంభం
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని11.03.2024న భద్రాచలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించి సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ 5.12.2024వ తేదీన ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15.04.2025వ తేదీ న అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ కింద నియామకం అయిన 350 మం ది అసిస్టెంట్ ఇంజనీర్లకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ( న్యాక్) లో ఆరు రోజుల పాటు శిక్షణ ఇప్పించి వారికి వివిధ జిల్లాలో ఇందిర మ్మ ఇళ్ల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ఇప్పటివరకు రూ.130 నుంచి రూ.140 కోట్లు చెల్లింపు
మొదటి విడతగా మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి, 47,335 మందికి ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి పత్రాలను ప్రభుత్వం అందించింది. ఇందులో 23,847 మంది ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో 7,824 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 895 ఇళ్ల గోడల నిర్మాణం, 64 ఇళ్ల శ్లాబ్ నిర్మాణం పూర్తయ్యాయి. వివిధ దశల్లో పూర్తయిన ఇళ్లకు ఇప్పటివరకు ప్రభుత్వం సుమారుగా రూ. 130 నుంచి రూ. 140 కోట్లను చెల్లించింది. అటవీ ప్రాంతాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 4 ఐటిడిఏ పరిధిలో ఆదివాసీల కోసం 9,350 ఇళ్లను, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు 8,750 ఇళ్లు, మొత్తం 18,100 గృహాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి, రెండు విడతల్లో ప్రకటించిన ఇళ్లకు అదనంగా ఈ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైట్.. రైట్!
మహిళలకు వరం.. ఉచిత బస్సు ప్రయాణం
మన తెలంగాణ / హైదరాబాద్: ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తుండగా ఆర్టికి లాభల బాట పట్టిస్తోంది. అనతి కాలంలోనే ఈ పథకం మహిళల ఆదరణ చూరగొంది. ఆర్టిసి ఫ్రీ బస్ స్కీమ్ తో ఆడబిడ్డలకు ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోంది. 9 డిసెంబర్ 2023న ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు, విద్యార్థినులకు, ట్రాన్స్ జెండర్స్కు ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, ఆర్డీనరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత మహిళా ప్రయాణీకులతో బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. ప్రతి రోజు 14 లక్షల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. మహాలక్ష్మీ పథకం గేమ్ ఛేంజర్ గా అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 179.55 కోట్ల మహిళలకు లబ్ధి చేకూరింది. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు రూ. 5997.50 కోట్ల మేరకు ఆదా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 202526 సంవత్సరంలో ఈ పథకం ద్వారా ఆర్టిసికి రూ.1.09 వేల కోట్ల లాభాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం కింద, మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు చూయించి రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడి కైనా జీరో టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చు ఆ చార్జీల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టిసికి చెల్లిస్తోంది. గతంలో ఆర్టిసి బస్సుల్లో రోజువారి ప్రయాణీకుల సగటు 45.49 లక్షలు ఉండగా ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత 59.10 లక్షలకు చేరినట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో అందుకనుగుణంగా ఆర్టిసి బస్సుల సంఖ్యను పెంచుతోంది.
స్కిల్స్ వర్శిటీతో నైపుణ్యాలకు మెరుగు
* 17 కోర్సులు..ఏటా 20వేల మందికి శిక్షణ
* వర్సిటీ మూడేళ్ల నిర్వహణకు రూ.312 కోట్లు అవసరం
* ఫీజుల రూపంలో సమకూరనున్న రూ.170 కోట్లు
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇం డియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలకు మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈబల్) అంతర్జాతీ య ప్రమాణాలకు దీటుగా ఈ క్యాంపస్ ను నిర్మించేందుకు అంగీకరించింది. అంతేకాదు కార్పొరేట్ సామాజిక బాధ్యశలో భాగంగా ఇందుకు రూ.200 కోట్ల భూరి విరాళాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 8వ 8 కాడమిక్, పరిపాలన, ల్యాబొరేటరీ, గ్రంథాలయం, పార్కింగ్, ఫుడ్ కోర్టు, 700 మంది కూర్చొనే సామర్థ్యం గల ఆడిటోరియం, భద్రతా సిబ్బంది వసతి గృహాలు, క్రీడా మైదానాల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీఎస్ఐఐసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలు ఆయా భూములను సేకరించి, చదును చేసి వర్సిటీకి అప్ప గించాయి. కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట సర్వే నంబర్ 112 లోని 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్య యంతో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వర్సిటీలో ఫార్మా, విజువల్ ఎఫెకట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్, ప్యాకింగ్, హార్డ్ వేర్, ఎలక్ట్రిషన్ వంటి 17 రంగాల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్, మూడేళ్ల డిగ్రీ, డిప్లొనూ, సర్టిఫికెట్ ఆన్లైన్ / ఆఫ్లైన్ కోర్సులను అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధరాబాబు ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ’యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్స్ బిల్లు 20:24 ను కూడా ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. గవర్నర్/ సీఎం ఈ వర్సిటీకి ఛాన్స్లర్గా వ్యవహరించనున్నారు. వీసీ సహా 15 మంది పాలకమండలి ఉంటుంది. అందులో ఏడుగురు సభ్యులు పరిశ్రమలకు చెందిన వారే ఉంటారు. వర్సిటీ మూడేళ్ల నిర్వహణకు రూ.312 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. రూ.170 కోట్లు కేవలం కోర్సుల ఫీజుల రూపంలో సమకూరనున్నాయి.
పేదలకు చేరువగా సర్కారు వైద్యం
మనతెలంగాణ / హైదరాబాద్: వైద్యఆరోగ్య శాఖకు కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేసింది. పేదలకు ప్రైవేట్లో మెరుగైన వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షల పెంచింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఈ నెల 30 వరకు 5,95,888 లక్షల మంది లబ్దిదారులు రూ.10 లక్షల లోపు ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందారు. నర్సింగ్, వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకు రూ. 4,369.143 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 2024 అక్టోబర్ 3న డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. 213 నూతన అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 16 నర్సింగ్ కళాశాలలను, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలను, 32 ట్రాన్స్జెండర్స్ క్లినిక్లను వర్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేశారు. ఒక్కోకాలేజీలో 50 చొప్పున, మొత్తం 400 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 17 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు చేశారు. గోషామహల్లో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా హాస్పిటల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.2 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరించేందుకు పనులు కొనసాగుతున్నాయి. ఆరోగ్య శాఖలో 7 వేలకు పైగా పోస్టుల భర్తీ చేయగా, మరో 6300 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 3 వేలకుపైగా కొత్త పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మెడికల్ కాలేజీలో రూ.121 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనం, గాంధీ మెడికల్ కాలేజీలో రూ. 80 కోట్లతో హాస్టల్ భవనాలను నిర్మించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ ప్రతి నెలా మొదటి వారంలోనే చెల్లించేలా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ చెల్లింపులు చేస్తోంది.
యువతకు అండాదండ…
రాజీవ్ యువ వికాసంతో స్వయం ఉపాధికి ఊతం
మన తెలంగాణ / హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం అములకు సర్వం సిద్ధమైంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద తొలి ఏడాదిలోనే రాష్ట్రంలో 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ పథకం కింద తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 న అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాల జారీలో భాగంగా కేటగిరీ-1, 2 యూనిట్లను కేటాయించనున్నారు. వీటిలో అర్హులైన 1.32 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని వెంటనే అమలు చేసేందుకు రూ.1,100 కోట్ల డబ్బు అవసరమని లెక్క తేల్చారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారులకు తొలి విడతలో ప్రాధాన్యమివ్వాలని, మిగతా కేటగిరీలకు 2, 3 విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కింద కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేసేందుకు వివిధ సంక్షేమ శాఖలు కార్యాచరణను సిద్ధం చేశాయి.
పెట్టుబడుల వరద
రూ.1,82,900 కోట్ల పెట్టుబడులు…51,400 ఉద్యోగాలు
పారిశ్రామికాభివృద్ధికి మెగా మాస్టర్ పాలసీ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రైజింగ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే దావోస్లో కుదిరిన ఒప్పందాల ద్వారా రూ.1,82,900 కోట్ల పెట్టుబడులతో 51,400 ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం మెగా మాస్టర్ పాలసీ 2050ని గత ఏడాది జనవరి 6న ప్రకటించింది. అలాగే పరిశ్రమల శాఖ ఎక్స్పోర్ట్ పాలసీ ని మే 21న ప్రకటించింది. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, ఐటి, ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఫార్మా విలేజీలు ఏర్పాటుతోపాటు హైదరాబాద్ తరహా రాష్ట్ర మంతటా అభివృద్ధి చేయడం ద్వారా అన్ని రంగాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తోంది. 2024 మార్చి 1 ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి ఇవ్వగా హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు నాగపూర్ జాతీయ రహదారిపై నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి లభించింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన 9 జిల్లాల్లో ప్రభుత్వ నిరుపయోగ బంజరు భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టబడులతో న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో హిందుస్థాన్ కోక కోలా బెవెరేజెస్ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యoలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. ఆరాజెన్ విస్తరణ ద్వారా రూ.2000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడంతో పాటు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ ద్వారా 1500 మందికి ఉపాధి కల్పన జరగనుంది. గోడి ఇండియా భారీ ప్రాజెక్టు గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం రూ.8000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.
రుణమాఫీతో రైతుకు దిలాసా
మన తెలంగాణ / హైదరాబాద్: వ్యవసాయం, దాని అనుబంధరంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి అన్నదాతలకు ఆలంబనగా నిలిచింది. ఈ ఏడాది వార్షి క బడ్జెట్లో వ్యవసాయ శాఖకు రూ. 24,439 కోట్ల నిధులు కేటాయిం చి రైతన్నకు బడ్జెట్ లో భరోసా కల్పించింది. రా ష్ట్రంలో వ్యవసాయం, అనుబంధరంగాలు 17.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రైతు భరోసా, పంటరుణం మాఫీ కల్పించడం ద్వా రా రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. వ్యవసాయరంగాన్ని పటిష్టవంతం చేసే దిశగా పండ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సాహం కల్పించింది.
పంటరుణం మాఫీ పథకం కింది ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ జరిగింది. అనతికాలంలోనే అర్హులైన 25,35,964 మంది రైతులకు రూ.20,616.89 కోట్లు మాఫీ జరిగింది.
రైతు భరోసా
రైతు భరోసా కింద ఎకరాకు రూ.12వేల చొప్పున రైతు భరోసా పథకానికి రూ.18వేల కోట్లు కేటాయించి రైతు భరోసా పథకాకి ఎటువంటి ఢోకా లేదని ప్రభుత్వం రైతాంగానికి స్పష్టం చేసింది. రైతు భరోసా పథకం కింది 69 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్ల చెల్లింపులు జరిగాయి. 2024-25 యాసింగి పంట కాలానికి సంబంధించి రైతు భరోసా సహాయం రూ.4666.59 కోట్లను 54.74 లక్షల మంది పట్టాదార్లకు ప్రభుత్వం విడుదల చేసింది.
గృహజ్యోతితో ఉచిత విద్యుత్
మన తెలంగాణ / హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం ఎంతో మందికి లబ్ధి చేకూర్చింది. కొద్దికాలంలోని ఈ పథకం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ప్రతి కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారే ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందవచ్చు. తెలంగాణలో 200 యూనిట్ల లోపు కరెంటు వాడే ఇళ్ల కనెక్షన్లు 1,08,86,519 ఉన్నాయని డిస్కంలు స్పష్టం చేశాయి. ఈ ఇండ్ల నుంచి 2024- నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో కరెంటు బిల్లుల రూపంలో రూ.3,914.36 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు.ఈమేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు నివేదిక అందించాయి. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అంటే 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగిస్తే రూపాయి కూడా బిల్లు కట్టాల్సిన పనిలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకం అమల్లో ఉండగా హైదరాబాద్ నగరంలోనూ పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఉన్నారు.
యంగ్ లీడర్… యంగ్ ఇండియా
ఆధునిక సౌకర్యాలతో రెసిడెన్షియల్ స్కూళ్లు
మనతెలంగాణ / హైదరాబాద్: సమాజంలోని వెనుకబడిన వర్గాలైన బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ, ఇబిసి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆయా కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుకు పూనుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధన సాగించేందుకు వీలుగా బోధన అభ్యసన పరికరాలతో పాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 600 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎటువంటి వసతులు కల్పించలేదు.. అవన్నీ దాదాపుగా ప్రైవేటు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వసతులు లేని ప్రైవేటు అద్దె భవనాల నుంచి అత్యాధునిక వసతులతో కూడిన ప్రభుత్వ భవనాల్లోకి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా వసతులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలు, ప్రతి పాఠశాలలో 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నాయి.
నాలుగు బ్లాక్లుగా అకడమిక్ బ్లాక్
ప్రతి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో అకడమిక్ బ్లాక్ నాలుగు బ్లాక్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. జీ+2 ఫ్లోర్లతో 1,60,339 చదరపు అడుగులు, డార్మెటరీ జీ+3 ఫ్లోర్లతో ఆరు బ్లాక్లతో 2,57,451 చదరపు అడుగులు, డైనింగ్ కమ్ కిచెన్ జీ+1 ఫ్లోర్లతో 41,860 చదరపు అడుగులు, 3 బిహెచ్కె ప్రిన్సిపల్ క్వార్టర్స్ నాలుగు యూనిట్లు ఒక బ్లాక్గా జీ+1 ఫ్లోర్లతో 7,483 చదరపు అడుగులు, 2 బిహెచ్కె స్టాఫ్ క్వార్టర్లు 48 యూనిట్లు 1 బ్లాక్గా, జీ+3 ఫ్లోర్లతో 61,378 చదరపు అడుగులు, 1 బిహెచ్కె క్వార్టర్లు 8 యూనిట్లు 1 బ్లాక్ గా, జీ+1 ఫ్లోర్లతో 7,324 చదరపు అడుగులతో మొత్తంగా 5,36,194 చదరపు అడుగుల వైశాల్యంతో ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం విశాలంగా జరగనుంది. ఇంజినీరింగ్ డిజైన్ల ఆధారంగా రేట్ల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని అన్ని అంచనాలు అత్యంత పారదర్శకంగా తయారు చేసినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఉద్యోగాల వెల్లువ
ఏడాదిన్నరలో 58,868 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
మనతెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దృష్టి సారించి భారీగా నియామకాలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు 58,868 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టింది. రాష్ట్రంలో ఉద్యోగార్థుల ఆకాంక్షల మేరకు నిరంతరం నియామకాలు కొనసాగేలా నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చింది. పెండింగ్లోని ఉద్యోగ నియామక పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులను తొలగింగి, గత ప్రభుత్వంలో రద్దయిన, వాయిదాపడిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించి, నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం తగ్గింది. నిరుద్యోగుల భవితకు ప్రజా ప్రభుత్వం బాసటగా నిలిచింది. 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 30,228 పొస్టులను మంజూరు చేయడంతో పాటు గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3 ఫలితాలను టిజిపిఎస్సి విడుదల చేసింది. గ్రూప్ -1 ద్వారా 563 పోస్టులు, గ్రూప్ -2 ద్వారా 783 పోస్టులు, గ్రూప్ -3 ద్వారా 1365 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలో నియామక పత్రాలు ప్రభుత్వం అందజేయనున్నది. 14,236 అంగన్వాడీ పోస్టు ల భర్తీకి నిర్ణయం తీసుకోగా, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకాలు చేపట్టారు. అందులో జూన్ 2వ తేదీన మొదటి విడతలో 3,550 మంది గ్రామ పరిపాలన అధికారులకు నియామక పత్రాలు ప్రభుత్వం అందజేయనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులు, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు 33 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సింగరేణిలో 599 ఎక్స్టర్నల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు సింగరేణిలో 1086 ఇంటర్నల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.ఆరోగ్య శాఖ లో 7 వేలకు పైగా పోస్టుల భర్తీ చేయగా, మరో 6300 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 3 వేలకుపైగా కొత్త పోస్టులకు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. జెడ్పి, మండల పరిషత్తుల్లో 524 ఆఫీసు సబార్డినేట్, నైట్ వాచ్మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించింది.బిఆర్ఎస్ పాలనలో ఒకేసారి 7857 పోస్టుల ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టగా, ప్రజా ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే 11062 పోస్టులతో మెగా డిఎస్సి -2024కి నోటిఫికేషన్ విడుదల చేసి, జులైలో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 30న ఫలితాలు వెల్లడించింది. దసరా పండుగ నాడు కొత్త టీచర్లకు సిఎం రేవంత్రెడ్డి మీదుగా నియామక పత్రాలు అందజేశారు. రికార్డు వేగంతో 52 రోజుల్లో టీచర్ పోస్టుల భర్తీ చేపట్టింది.
సిఎం రేవంత్ లౌక్యం
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం
మనతెలంగాణ / హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు సత్ఫలితాలను ఇచ్చాయి. కంటోన్మెంట్ భూముల నుంచి ఐపిఎస్ల కేటాయింపుల వరకు ఒక్కోక్కటిగా కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులు, సంప్రదింపులు సాకారమవుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశాల్లో కంటోన్మెంట్ భూములతో పాటు ఐపిఎస్ల కేటాయింపు, రాష్ట్ర రోడ్లు ఎన్హెచ్ఏఐలుగా గుర్తించడం, హైదరాబాద్కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే వాటి కోసం సిఎం రేవంత్ పలుమార్లు కేంద్రమంత్రులను, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి వినతిపత్రాలను ఇస్తూనే ఉన్నారు. తెలంగాణకు అదనంగా ఐపిఎస్ అధికారుల పోస్టులను రాబట్టడంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన అనంతరం కేటాయించిన ఐపిఎస్ అధికారులు రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు గతంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వివరించారు. ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రులను కలిసిన ప్రతిసారి ఐపిఎస్ కేడర్ పోస్టుల పెంపు గురించి ముఖ్య మంత్రి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.