ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడి
ఎకోటౌన్ ప్రాజెక్టుకోసం కిటాక్యూషు నగరంతో ఒప్పందం
మనతెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్ కోసం కొత్త ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా రాష్ట్ర పురోగతిని (Telangana development) ముందుకు తీసుకువెళుతున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణ, కిటాక్యూషుల మధ్య పరస్పర సహకార ఒప్పందంతో కొత్త ఆవిష్కరణలకు, సహకారానికి పునాది అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్లో సిఎం రేవంత్ రెడ్డి కిటాక్యూషులో పర్యటించగా జపాన్తో ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభు త్వం ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జపాన్ కిటాక్యూషు మేయర్ కజుహిసా టక్యూచీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం సిఎం రేవంత్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్కు వచ్చిన మీ ప్రతినిధి బృందానికి స్వాగతమంటూ సిఎం పేర్కొన్నారు. ఏప్రిల్లో తాను జపాన్ను సందర్శించినప్పుడు అక్కడి అభివృద్ధిని, వారి పని తీరును చూశానని సిఎం తెలిపారు. కిటాక్యూషు నగరం ఎకో-టౌన్ మోడల్ తో చాలా ప్రేరణ పొందానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వారిచ్చిన ప్రేరణతోనే రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్లో అలాంటి నమూనాను అభివృద్ధి చేయడం కోసం అనేక జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసిందని సిఎం తెలిపారు.
తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడం మా ప్రధాన ప్రాధాన్యత
తెలంగాణ, కిటాక్యూషు మధ్య సహకార ఒప్పందం పై ఈరోజు సంతకం చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఒప్పందం సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో సహకారానికి పునాది కానుందన్నారు. మూసీనది అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్ట్పైన తమ దృష్టి ఉందన్నారు.
తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడం కూడా తమ ప్రధాన ప్రాధాన్యతగా ఆయన తెలిపారు. తమ విద్యార్థులు జపనీస్ భాష నేర్చుకోవాలనుకుంటున్నారని, జపాన్లో అవకాశాలను అన్వేషించాలనుకుంటున్నారని, సిఎం రేవంత్ తెలిపారు. మీ సాయంతో, మా విద్యార్థులకు జపనీస్ నేర్పించాలని అనుకుంటున్నామని సిఎం పేర్కొన్నారు. హైదరాబాద్, కిటాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నామని, మీ నగరం చూపిన నాయకత్వాన్ని తాను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు.
Telangana development