ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు బాలకృష్ణకు
ఎన్టిఆర్ జాతీయ పురస్కారం మణిరత్నానికి పైడి జయరాజ్
అవార్డు అట్లూరి పూర్ణచందర్రావుకు నాగిరెడ్డిచక్రపాణి
అవార్డు సుకుమార్కు బిఎన్రెడ్డి పురస్కారం విజయ్
దేవరకొండకు కాంతారావు అవార్డు 201423 కాలానికి
గద్దర్ అవార్డులను ప్రకటించిన కమిటీ రాజమౌళి రెండు
సినిమాలు బాహుబలి2, ఆర్ఆర్ఆర్లు ఉత్తమ చిత్రాలుగా
ఎంపిక రుద్రమదేవి, బలగం, మహానటి తదితర
చిత్రాలకు గద్దర్ పురస్కారాలు
ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు
బాలకృష్ణ, సుకుమార్, మణిరత్నం, విజయ్ దేవరకొండ, అట్లూరి పూర్ణచంద్రరావు, యండమూరి వీరేంద్రనాథ్లకు ప్రత్యేక అవార్డులు
రుద్రమదేవి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, మహానటి, మహర్షి, అల వైకుంఠపురంలో, బలగం చిత్రాలకు గద్దర్ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను 2024 ఏడాదిగాను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాలను అవార్డులకు ఎంపికచేశారు. ఈ మేరకు సినీ నటుడు, జ్యూరీ ఛైర్మన్ మురళీమోహన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి చిత్రాల పేర్లను తెలియజేశారు. ఎఫ్డిసి ఛైర్మన్, నిర్మాత దిల్రాజుతో కలిసి ఆయన గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2014 జూన్ 2 తర్వాత సెన్సార్ అయిన సినిమాల నుంచి డిసెంబర్ 2023 వరకు వచ్చిన చిత్రాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మురళీ మోహన్ వెల్లడించారు. వాటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు, ఆరు ప్రత్యేక అవార్డులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి- – చక్రపాణి అవార్డులతో పాటు అదనంగా పైడి జయరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను మీడియా సమక్షంలో జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు, నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, దర్శకుడు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు, దర్శకుడు సుకుమార్కు బీఎన్రెడ్డి ఫిల్మ్ అవార్డు, నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు, నటుడు విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును ప్రకటించారు. ఇదిలాఉండగా 2014 నుంచి 2023 వరకు ప్రకటించిన ప్రథమ ఉత్తమ చిత్రాల్లో అనుష్క నటించిన రుద్రమదేవి, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, అలనాటి ఉత్తమ నటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి, మహేష్బాబు నటించిన మహర్షి, అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురంలో, తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బలగం వంటి బ్లాక్బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఈ జాబితాలో నిలిచిన చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అత్యుత్తమ సృజనాత్మకతకు, సాంకేతిక విలువలకు అద్దం పడుతున్నాయి. ఇక తెలుగు సినిమాలకు వివిధ విభాగాలలో 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తం చేసింది.