Tuesday, July 1, 2025

కొత్త హెచ్‌ఐవి బాధితులు 14,084 మందికి పింఛన్ మంజూరు

- Advertisement -
- Advertisement -

హెచ్‌ఐవి బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయ కోణంలో స్పందించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం నాడు 14,084 మంది కొత్త హెచ్‌ఐవి బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ఈ పింఛన్లు జూలై నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్‌ఐవి బాధితులు పూర్తి స్థాయిలో పని చేయలేని స్థితిలో ఉండటంతో పాటు, వారిపై నెలనెలా అధిక వైద్య ఖర్చులు కూడా పడుతున్నాయని తెలిపారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. పేదరికంతో బాధపడుతున్న హెచ్‌ఐవి బాధితుల జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు చేయూత పథకం కింద ఈ సాయం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34,421 మందికి నెలకు రూ.2016 చొప్పున పింఛన్ అందుతోందని, ఇందుకోసం నెలవారీగా రూ.6.93 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. 2022 ఆగస్టు తరువాత హెచ్‌ఐవి కేటగిరీలో కొత్తగా పెన్షన్లు మంజూరవ్వలేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా నమోదైన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం సెర్ప్ ద్వారా పింఛన్లు మంజూరు అయ్యాయని వివరించారు.

జిల్లాల వారీగా అర్హుల సంఖ్య ఇలా…
హైదరాబాద్‌లో 3,019, నల్గొండ – జిల్లాలో 1,388, ఖమ్మం – 954, సూర్యాపేట – 931, కరీంనగర్ – 833, ఆదిలాబాద్ -482, భద్రాద్రి కొత్తగూడేం- 556, హన్మకొండ -825, జగిత్యాల- 306, జనగాం- 228, కామారెడ్డి -702, మహబూబ్ నగర్- 452, నిజామాబాద్- 528, పెద్ద పల్లి -567, సంగారెడ్డి -1242, సిద్దిపేట -527, వికారాబాద్- 544 మంది లబ్దిదారులు ఉనారని పేర్కొన్నారు. అయితే జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఈ నూతన లబ్ధిదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వ్యయం రూ.28.40 కోట్లు కాగా, కావాల్సిన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఇప్పటికే 4,020 మంది డయాలసిస్ పేషెంట్లకు ఈ మధ్యే పించన్ మంజూరు చేయగా తాజాగా హెచ్‌ఐవి బాధితులకు పింఛన్ మంజూరు చేయడంతో ఈ వర్గాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News