30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో
ప్రక్రియ ప్రారంభం 21వ తేదీలోగా
పూర్తి అదేరోజు తుది నోటిఫికేషన్
జారీ 5నుంచి 11 వరకు అభ్యంతరాల
స్వీకరణ 16వరకు పరిశీలన
ఒఆర్ఆర్ పరిధిలోని 13
మున్సిపాలిటీలలో విభజన వాయిదా
మన తెలంగాణ / హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. పలుచోట్ల పాలకవర్గాల గడువు ముగియడంతో పురపాలికలు, నగరపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 30 మున్సిపాలిటీల్లో విలీనం కానున్న గ్రామ పంచాయతీల వార్డులను పునర్విభజన చేయడానికి పురపాలక శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 21వ తేదీలోపు 19 రోజుల్లో ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని ఆయా మున్సిపాలిటీలకు పురపాలక శాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే వార్డుల పుపర్విభజనకు సంబంధించి బుధవారం అధికారులు నోటిఫికేషన్ను జారీ చేసి, జూన్ 21న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని పురపాలక శాఖ సూచించింది. మొత్తం 43 మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా ఓఆర్ఆర్ లోపల ఉన్న 13 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనను ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కింద ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నందున ఈ 13 మున్సిపాలిటీలను మినహాయించి, ఓఆర్ఆర్ బయట ఉన్న 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ ప్రక్రియను చేపట్టాలని పురపాలక శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఏడురోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
ఈనెల 3న భౌగోళికంగా వార్డులను పునర్విజన చేస్తూ మున్సిపాలిటీల ద్వారా ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేయనున్నారు. ఈనెల 4వ తేదీన వార్డుల విభజన ప్రతిపాదనలకు నోటీసు ఇవ్వడం, సాధారణ ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలకు లేఖలు ఇవ్వడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏడురోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి, అభిప్రాయ సేకరణ చేయడం, సూచనలు, పరిష్కారాలు కోరడం లాంటి చర్యలను అధికారులు చేపట్టనున్నారు. ఇక, 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఐదురోజుల పాటు స్వీకరించిన అభ్యంతరాలపై విచారణ చేపట్టి 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెండు రోజుల పాటు అభ్యంతరాలు పరిష్కరించిన తరువాత కలెక్టర్ ఆమోదం తీసుకుంటారు. 19వ తేదీన పురపాలక శాఖకు నివేదిక సమర్పిస్తారు. 20వ తేదీన పురపాలక శాఖ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందచేసి 21వ తేదీన తుది నోటిఫికేషన్ను జారీ చేస్తారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 వార్డులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విలీనమైన గ్రామ పంచాయతీల్లోని వార్డుల పునర్విభజనకు సంబంధించి నేడు నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. అందులో భాగంగా కోహిర్లో 16 వార్డులు, కేసముద్రంలో 16 వార్డులు, అశ్వరావుపేటలో 22, స్టేషన్ ఘన్పూర్లో 18, మద్దూర్లో 16, ఎదులాపురం 32, దేవరకద్రలో 12, గుమ్మడిదలలో 22, గడ్డపోతారంలో 18, ఇస్నాపూర్లో 22, చేవెళ్లలో 18, మొయినాబాద్లో 26, ములుగులో 20, బిచ్కుందాలో 12, అలియాబాద్లో 20, మూడుచింతలపల్లెలో 24, ఎల్లంపేటలో 24, మహ బూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60, మంచిర్యాలలో 60, నర్సంపేటలో 30, పరిగిలో 18, కొల్లాపూర్లో 19, ఆలేరులో 12, బాన్సువాడలో 19, జగిత్యాలలో 50, హాలియాలో 12, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 వార్డులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 వార్డులు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 60 వార్డులకు సంబంధించిన పునర్విభజన ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను 19 రోజుల్లో ఆయా మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు పూర్తి చేయనున్నారు.