హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ఎంఎల్ సి కవిత ప్రశ్నించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి (Telangana Jagruti strike) ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు. కెసిఆర్ కి నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని, తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కెసిఆర్ గారు చేసిన తప్పా? అని దుయ్యబట్టారు.
తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా? అని అడిగారు. కాళేశ్వరం కమిషన్ కాదు అని అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని కవిత విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ధర్నాను ఆపితే ప్రతి జిల్లాలోని గల్లీ గల్లీ తిరుగుతామని హెచ్చరించారు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, 15 రిజర్వాయుర్లు, 200 కిలో మీటర్ల, 1500 కిలో మీటర్ల పైచిలుకు కాలువలు ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోసిన మట్టితో 300 పిరమిడ్లు నిర్మించవచ్చన్నారు. కాళేశ్వరంలో ఉపయోగించిన స్టీలుతో వంద యాపిల్ టవర్లు నిర్మించవచ్చని కవిత తెలియజేశారు. ఈ ధర్నాలో ఎంఎల్సి కవిత, జాగృతి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.