ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సెమీకాన్ ఇండియా2025లో టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (టిసిహెచ్ఐపి) టీమ్ గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా టిసిహెచ్ఐపి వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాల సెమీ యూనివర్శిటీ అండ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శారీ లిస్, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఇఎస్ఎ) డైరెక్టర్ డా. విశ్వనాథన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ చర్చలో భాగంగా, తెలంగాణలో 1,000మంది ఫ్యాకల్టీని ఎఫ్డిపి (ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) ద్వారా అప్స్కిల్ చేసి, 2030 నాటికి ప్రపంచానికి కావాల్సిన సెమీకండక్టర్ నైపుణ్య శక్తి (స్కిల్డ్ టాలెంట్)ను తీర్చేందుకు సహకరించాలి అనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 1.5 మిలియన్ సెమీకండక్టర్ ప్రొఫెషనల్స్ కొరత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో భారత్ ఒక్కటే 85,000మంది ఇంజినీర్లు, టెక్నికల్ వర్కర్స్ అవసరం పడనుంది.
ఈ సందర్భంలో శారీ లిస్ మాట్లాడుతూ భారతదేశానికి అద్భుతమైన ప్రతిభ ఉంది. కానీ దానిని పరిశ్రమ అవసరాలకు సరిపడేలా తీర్చిదిద్దటం అత్యవసరం. టిసిహెచ్ఐపితో భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో ఫ్యాకల్టీ ట్రైనింగ్ మొదలవుతుంది. దీని వల్ల పరిశ్రమ రెడీ టాలెంట్ వేగంగా పెరుగుతుంది అని పేర్కొన్నారు. టిసిహెచ్ఐపి ప్రతిపాదించిన ఫోర్-పిల్లర్ స్ట్రాటజీ – టాలెంట్ డిజైన్ మాన్యుఫాక్చరింగ్ అప్లికేషన్స్ పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించాలన్న సంకల్పాన్ని సందీప్ మక్తాల తెలియజేశారు. భారత్ చిప్ విప్లవానికి తెలంగాణే లాంచ్ప్యాడ్ అవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఇప్పటికే భారత్ను గ్లోబల్ సెమీకాన్ హబ్గా తీర్చిదిద్దాలనే స్పష్టమైన లక్ష్యాన్ని ప్రకటించారని గుర్తు చేస్తూ, సందీప్ మక్తాల ఈ ఇనిషియేటివ్ అదే విజన్తో ముందుకు వెళ్తుందని చెప్పారు. ఐఇఎస్ఎ డైరెక్టర్ డా. విశ్వనాథన్ మాట్లాడుతూ, ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో ముందంజలోకి వస్తుంది. టిసిహెచ్ఐపి వంటి ప్రాజెక్టులు పరిశ్రమకు కొత్త ఊపు ఇస్తాయి అని అభిప్రాయపడ్డారు.