రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా తలపెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమైంది. అవతరణ దినం జూన్ 2న వితరణ, ఆదరణల జాబితా రెడీ చేస్తోంది. రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు వగైరా పంపిణీ చేయనుంది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన కవులు, కళాకారులు, ప్రముఖులను గౌరవించుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి రూ. ఒక కోటి చొప్పున చెక్కులు, ఫ్యూచర్ సిటీలో 300 గజాల వంతున ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అందజేస్తారు. స్వరాష్ట్ర సాధన పోరాటాల్లో కేసులు, జైలు పాలైన తెలంగాణ ఉద్యమకారులకు అదే ‘చెయ్యి’ తో నివేశనా స్థలాల పంపిణీ ప్రారంభించి అవతరణ దినోత్సవాన్ని సార్థకం చేయాలి రేవంతన్నా. డజను వందల మంది ప్రాణత్యాగం.. వేలాది మంది జైలు జీవితం.. వర్ణనకు అందని వెతల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2. ఆ రోజటి వితరణ, ఆదరణ జాబితాలో స్వరాష్ట్ర ఉద్యమకారులకు ప్రోత్సాహకాల అంశం జాడ ఉండాలి.
వారికి ఊరట, ఉపశమనం, గౌరవం, గుర్తింపు దక్కాలి. కెసిఆర్ చేయలేనివి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సర్కారు చేయాలి. ఎలాగూ డబ్బులతో ముడిపడినవి అంటేనే విసుక్కుంటున్న ప్రజాప్రభుత్వం కనీసం ఆర్థికేతర ప్రయోజనాలైనా తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు, ఉద్యమ కాలం ఆసాంతం అలుపెరుగని రిపోర్టింగ్ చేసిన తెలంగాణ పాత్రికేయులు అందరికీ బేషరతుగా ఒనగూర్చాలి. మచ్చుకు సిహెచ్ వెంకట నర్సింగారావు, గాడిచెర్ల దేవయ్య ముదిరాజ్, ఉల్లి యాది మల్లేశ్ యాదవ్… నాటి ఉమ్మడి కరీంనగర్, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టి(బి)ఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు. తెలంగాణ సాధన సమరాంగణాన 2009లో ఉద్యమ కేసులతో వాళ్ళు జైలు జీవితం గడిపారు. వారిలాగే రాష్ట్రం నలుమూలలా వేలాది మంది తమ వ్యక్తిగత జీవితాల్లోని ప్రైమ్టైమ్ను తెలంగాణ కోసం పణంగా పెట్టారు. బిఆర్ఎస్ అనే కాదు కాంగ్రెస్, బిజెపి సహా అన్ని రాజకీయ పక్షాలు, సంస్థల వారూ తెలంగాణ స్వాతంత్య్రం కోసం ఫీల్డులో పోరాడారు.
తన పార్టీ వారికీ మేలు జరిగేలా, తన పర భేదం లేకుండా మొత్తంగా తెలంగాణ ఉద్యమకారులు అందరినీ అధికారికంగా గుర్తించి ఆదరించడానికి సరాసరి రెండు పర్యాయాల పాలనా కాలం కెసిఆర్ ప్రభుత్వానికి సరిపోలేదు. మరుగున పడిన తెలంగాణ ఉద్యమకారుల (Telangana activists) నివేశనా స్థలాల ఫైలునూ వెంటనే ముందర వేసుకోవాలి. కేసులై జైలు కెళ్ళిన తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు ఒకే చోట ఫోర్త్ సిటీలో ప్లాట్లు ఇవ్వాలి. ఉద్యమ సారథిగా తెలంగాణ తొలి సిఎం కెసిఆర్ చేయలేకపోయిన మేలు చేసి చూపించాలి. జూన్ 2 జాబితాలో ఈ అంశాన్ని సత్వరం చేర్చాలి. ఆ రోజు నిర్దిష్ట కాలావధితో ఓ విధాన ప్రకటన చేసి, అవతరణ వేడుకలను సుసంపన్నం చేయాలి. ఎన్నెన్నో ఉద్వేగాల జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం.
తెలంగాణ రాష్ట్రం అయ్యాక మొదటిసారి ఏలుబడిలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇది రెండో అవతరణ దినం. ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాక జూన్ 2 కేవలం ఆరు నెలల్లో తలుపు తట్టింది. అప్పటికి సెట్ రైట్ అవ్వాల్సినవి ఉండేవి. అందువల్ల ఆయా వర్గాలవారు అర్థం చేసుకున్నారు. అలాంటి వాళ్ళలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఉన్నారు. సమైక్య పాలనలో ఎందరో ఒకటికిమించి అనేక కేసుల్లో నిందితులుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు. అరెస్టు, జైలూ తప్పని తెలంగాణ వాదులు చాలా మందే. ఒక లెక్క ప్రకారం చూస్తే 2009 డిసెంబర్ 9 నుంచి 2014 జూన్ 2 వరకు (రాష్ట్రం ఏర్పడే వరకు) 2254 కేసులు రిజిస్టర్ అయినట్టు అంచనా. ఆ కేసుల్లో ఉన్న వాళ్ళలో ప్రొఫెషనల్స్గా పొలిటీషియన్లతో పాటు, విద్యార్థి, నిరుద్యోగ వివిధ రంగాల సాధారణ పౌరులూ రకరకాల కష్టాలు ఎదుర్కొన్నారు. అప్పటి కేసుల వ్యతిరేక ప్రభావం వ్యక్తిగత జీవితాలపై తీవ్రంగా ప్రసరించింది. పాసుపోర్టు వంటివి సమయానికి అందక చెప్పుకోలేని బాధలు చవిచూశారు.
అమరులైన వారి 1200 కుటుంబాలు సహా కేసులు, రిమాండ్ అయిన వారి కుటుంబాలూ ఎన్నో వేదనలుపడ్డాయి. అలాంటి వారి కష్టంతో సొంత రాష్ట్రం కల 2014 జూన్ 2న ఎట్టకేలకు నెరవేరింది. ముఖ్యంగా ప్రత్యక్ష ఉద్యమంలో అవిశ్రాంతంగా భాగమైన లెక్కకు అందని పౌరుల్లో జైలు జీవితం గడిపిన వేలాది మంది తమ స్వేదం, త్యాగం వృథా కాలేదని గర్వంగా ఫీలయ్యారు. ప్రధానంగా తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా అధికారిక గుర్తింపు కోరుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ ఛాంపియన్ కెసిఆర్ ముఖ్యమంత్రిగా చేయలేనివి ప్రస్తుత సిఎం చేయగలరని చాలా మందిలో నమ్మకం. రేవంత్ రెడ్డి కూడా తమ ప్రజాపాలనలో తన సక్సెస్ సీక్రెట్ అదే కాబోతుందని కడపటి ఎన్నికలకు ముందు నొక్కి చెప్పారు.
ఉద్యమ సారథే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినందున ఉద్యమ భాగస్వాములు అందరికీ మేలు జరుగుతుందని అప్పట్లో ఆశించారు. అయితే 2250 కేసుల వరకు ఉపసంహరణో, వీగిపోవడమో మాత్రం జరిగి ఉంటుంది. అమరులైన కుటుంబాల్లో చిట్టచివరి బాధితులనే గుర్తించలేదనే అపప్రద గత పాలకులు మూటగట్టుకున్నారు. కేసులతో జైలుకెళ్లిన ఉద్యమకారులను ఏదో విధంగా ఆదరించేంతటి పుష్కలమైన సమయం రెండు టర్ముల్లో కావాల్సినంత ఉండింది. కనీసం ఆర్థికేతర ప్రయోజనాలైనా చేకూర్చలేదు. రేవంత్ రెడ్డి పట్టుకున్న అనేక పాయింట్లలో ఇదొకటి. ఉద్యమకారులకు నివేశనా స్థలాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తొలినాళ్ళలో కేసుల సమాచారం, జైలుకు వెళ్లిన ఉద్యమకారుల వివరాలు సేకరించారు.
లాభితులు కాబోయే వారిలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు, నిరుద్యోగ యువత తదితరులు ఉంటారు. నిధులతో ముడిపడిన ఇతరత్రా మేళ్ళ మాటెలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మానస పుత్రిక ప్రతిపాదిత ఆ ఫోర్త్ సిటీలోనైనా రాష్ట్ర వ్యాప్త ఉద్యమకారులు అందరికీ ఒకేచోట ఇళ్ల స్థలాలు కేటాయించాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన విధాన ప్రకటనతో దీనిపై కార్యాచరణ వెల్లడించాలి. తద్వారా పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందాలి. కెసిఆర్ ఈర్ష్య పడేలా వివిధ వర్గాల వారి కృతజ్ఞతలు ఆస్వాదించాలి. అదే సమయంలో మలిదశ ఉద్యమాన (2001- 2014) రిపోర్టింగ్ చేసిన తెలంగాణ పాత్రికేయులు అందరికీ పనిలో పనిగా ఔదార్యంతో అక్కడే ప్లాట్లు ఇవ్వాలి. అందరిలా జర్నలిస్టులను కూరలో కరివేపాకుగా పరిగణించే పాలకులం తాము కాదని రూఢీ చేయాలి.
- ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384