మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అధిష్ఠానం కసరత్తు?
సీనియర్ మంత్రుల శాఖలు తగ్గించే యోచనలో హైకమాండ్?
ఢిల్లీలో ఎఐసిసి అగ్రనేతలతో రెండవరోజూ సిఎం భేటీ
రెండున్నర గంటలపాటు సమావేశం పిసిసి వర్కింగ్
ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ పదవులపై సుదీర్ఘ చర్చ డిప్యూటీ
సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు
అధిష్ఠానం పిలుపు హుటాహుటిన ఢిల్లీకి చేరిన ఉత్తమ్
మోడీ 11ఏళ్ల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
సిఎం రేవంత్కు దిశానిర్దేశం చేసిన రాహుల్, ఖర్గే
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మం త్రుల శాఖల ప్రక్షాళన దిశగా ఎఐసిసి నాయకత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రులకు శాఖల కేటాయింపు, పాత మంత్రుల నుం చి శాఖల తొలగింపునకు సంబంధించి ఏఐసిసి అగ్రనాయకులు ఢిల్లీలో సిఎం రేవంత్రెడ్డితో సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ఈ నే పథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏఐసిసి అగ్రనేతలతో మంగళవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సిఎం రేవంత్ భేటీ అయ్యా రు. సుమారుగా రెండున్నర గంటల పాటు వా రితో సిఎం రేవంత్ సమావేశ మయ్యారు. కొత్త మంత్రుల శాఖలపై ఆయన వారితో చర్చించా రు.
మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, పిసిసి కార్యవర్గంలో మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ పదవులు, ఎస్సీ వర్గీకరణ, బి సి కులగణన వంటి విషయాల గురించి మాట్లాడారు. దీంతోపాటు సీనియర్ మంత్రులు వివిధ శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి నుంచి కొన్ని శాఖలను ఇతరులకు బదిలీ చేసే అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. సోమవారం రాత్రి టిపిసిసి కార్యవర్గం నియామకాలు చేపట్టగా, పదవులు దక్కని వారికి న్యాయం చే సేందుకు వివిధ రాష్ట్ర రంగ సంస్థలకు చైర్మన్ ప దవులను కట్టబెట్టే దిశగా చర్చలు జరిగినట్టుగా సమాచారం.
అయితే, కాంగ్రెస్ హైకమాండ్ పలువురు మంత్రుల శాఖలను తొలగించే యో చనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా పూర్తిస్థాయిలో దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే మంత్రుల పనితీరు గురించి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. దీంతో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని మీనాక్షి అధిష్ఠానానికి సూచించారని, ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఏఐసిసి మీనాక్షికి సూచించినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ప్రస్తుతం కొందరి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మోడీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణనకు సంబంధించి జనంలో ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రంలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సిఎం రేవంత్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అగ్రనేత రాహుల్గాంధీలతో పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ సభలకు రావాలని, దీనికి సంబంధించిన తేదీలను ఫిక్స్ చేయాలని సిఎం వారికి విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం.
మెదక్లో ఎస్సీ వర్గీకరణ సభ, సూర్యాపేటలో బిసి కులగణన సభలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా సిఎం రేవంత్ వారితో పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మోడీ 11 ఏళ్ల పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్, మల్లికార్జున ఖర్గేలు సిఎం రేవంత్కు సూచించినట్టుగా తెలిసింది.
ఢిల్లీ నుంచి ఉత్తమ్, భట్టిలకు ఫోన్
ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలకు మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఉన్న మంత్రులకు శా ఖల మార్పుతోపాటు టిపిసిసి కార్యవర్గ కూర్పుతో పాటు పలు అంశాల నేపథ్యంలో వారిద్దరికి ఏఐసిసి పెద్దల నుంచి పిలుపు రావడంతో కాంగ్రెస్లో ఆసక్తిని పెంచింది. అయితే ఉన్న పళం గా వారిద్దరికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అన్నది తెలియాల్సి ఉంది.
మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్లో ప్రస్తుత తాజా పరిణా మాలు ఉత్కంఠను రేపుతున్నాయి. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెంట ఉత్తమ్ భార్య పద్మావతి కూడా ఢిల్లీకి వెళ్లారు. అయితే డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క దగ్గరి నుంచి ఆర్థిక శాఖను తీసివేసి ఆయనకు హోంశాఖను కేటాయించే అవకాశం ఉందని, ఉత్తమ్కుమార్రెడ్డి దగ్గరి నుంచి ఇరిగేషన్ శాఖను తీసివేసి ఆయనకు వేరే శాఖను అప్పగించే అవకాశం ఉందని, ఇక మంత్రి శ్రీధర్బాబు నుంచి ఐటీ, పరిశ్రమల శాఖను ఉత్తమ్కు అప్పగించి, ఆర్థికశాఖను శ్రీధర్బాబకు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.