Friday, June 20, 2025

త్వరలో ఇద్దరు సిఎంల భేటీ

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రి సిఆర్ పాటిల్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,
రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బనకచర్లపై
ఆందోళనలు కేంద్రమంత్రికి వివరించిన సిఎం బృందం తెలంగాణకు
అన్యాయం జరగనివ్వనని పాటిల్ అభయం త్వరలో అపెక్స్
కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ కేంద్రమంత్రిని
కలిసివచ్చిన అనంతరం మీడియాకు వెల్లడించిన మంత్రి ఉత్తమ్
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడబోమని కేంద్రమంత్రికి స్పష్టం
చేసిన సిఎం న్యాయం జరగకపోతే సుప్రీంకు వెళ్తామని స్పష్టీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి బనకచ ర్ల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ఇరు రాష్ట్రాల సిఎంలతో భేటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీనిచ్చారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అంతకుముం దు రాష్ట్ర ప్ర యోజనాలకు విరుద్ధంగా ఎపి ప్రభు త్వం ప్రతిపాదిస్తున్న గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలి టీ రిపోర్టును తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీ ఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీ టి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గో దావరి జలవివాదాల ట్రైబ్యునల్-1980 (జీడబ్ల్యూడిటి),ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారిస్తోందని కేంద్ర మంత్రికి వారు ఫిర్యాదు చేశా రు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జల్‌శక్తి మంత్రి సీ ఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో  ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహారిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఎపి చెబుతోందని, జీడబ్ల్యూడిటి -1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు.

సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే…
2014 ఎపి పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని బనకచర్ల విషయంలో ఎపి వాటిని ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్ తెలియజేశారు. బనకచర్ల విషయంలో ఏ నిబంధనలు పాటించని ఆంధ్రప్రదేశ్ వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెబుతుండడం తీవ్ర అభ్యంతరకరమని జల్‌శక్తి మంత్రితో సిఎం పేర్కొన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జల్‌శక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఎపి చేపట్టిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఫిర్యాదు చేశారు.

పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు సిద్ధం
జీడబ్ల్యూడిటి -1980 నిబంధనల ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉందని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సిఎం వివరించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించ కుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్రమంత్రిని సిఎం కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఎపి భావిస్తుంటే పోలవరం -బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే

ఇచ్చంపల్లి- నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని కేంద్ర మంత్రికి సిఎం, మంత్రి ఉత్తమ్‌లు తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ -2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కేంద్రమంత్రికి సిఎం రేవంత్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నిస్తామని సిఎం రేవంత్ కేంద్రమంత్రి పాటిల్‌కు తెలియజేశారు. కేంద్ర స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేంద్రమంత్రికి సిఎం రేవంత్ స్పష్టం చేశారు.

1500 టిఎంసిలను వాడుకునేలా అనుమతులు ఇవ్వండి….
తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టిఎంసిలు, కృష్ణానదిలో 500 టిఎంసిలు మొత్తంగా 1,500 టిఎంసిల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసి) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1500 టిఎంసిల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని ఆ తర్వాత ఎపి చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

అన్ని ప్రాజెక్టుల నీటి కేటాయింపులను వెంటనే మంజూరు చేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని జల్‌శక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య పలు అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. పాలమూరు -రంగారెడ్డి, సమ్మక్క -సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతాం: మంత్రి ఉత్తమ్
కేంద్రమంత్రితో సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం బనకచర్ల విషయంలో తెలంగాణకు న్యాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. లేనిపక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. బనకచర్లకు సంబంధించిన డిపిఆర్ తమకు అందలేదని కేంద్ర మంత్రి తెలిపారని, త్వరలోనే ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఎపి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతుందని, అనుమతులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. బనకచర్ల నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం

జరిగిందని, బనకచర్ల పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. కేంద్రమంత్రి కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారని మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు మూసీ పునరుజ్జీవనానికి నిధులివ్వాలని కోరినట్టు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఎంపిలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News