Tuesday, June 3, 2025

‘కూల్‌గా’ గడిచిన వేసవి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు
రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్: భానుడి ప్రతాపంతో వేడిగా ఉండాల్సిన వేసవి ఈ సంవత్సరం కూల్‌గా గడిచిపోయింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయినప్పటికి వాతావరణంలో జరిగిన మార్పులతో అకాల వర్షాలు, ముందస్తు రుతుపవనాలతో ప్రజలు వేసి కాలాన్ని చల్లగా ఆస్వాదించారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో ఈసారి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువ రోజులు కనిపించలేదు. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా తరువాత అడపాదపడపా కురిసిన వర్షాలతో ఎక్కువ రోజులు వాతావరణం చల్లగానే ఉంది. మరోవైపు వేసవి సీజన్‌లో వర్షాలు విస్తారంగా కురిశాయి. గతేడాది వేసవి సీజన్‌లో సాధారణం కంటే 160 శాతం అధిక వర్షాలు కురవగా ఈ సీజన్‌లో అంతకు రెట్టింపు వర్షాలు కురిశాయి.

కొనసాగుతున్న వర్షాలు

రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే మూడు రోజలు పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

సాధారణం కంటే అధికంగా

రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సీజన్‌లో నెలవారీగా కురవాల్సిన సాధారణ వర్షాపాతం కంటే ఎక్కువ మోతాదులోనే వర్షాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నెల నుంచి మే నెలాఖరు వరకు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రంలో సగటున 55.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. అయితే గత నాలుగేళ్లుగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే సాధారణం, అంతకు మించి వర్షాలు నమోదవుతున్నాయి. 2022 వేసవి సీజన్‌లో సగటున 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 2024 వేసవిలో 80.5 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. గతేడాది నైరుతి సీజన్‌లో వర్షపాతం గణాంకాలు ఆశాజనకంగా లేవు. సాధారణ వర్షపాతం నమోదయినప్పటికీ పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సారి వేసవి సీజన్‌లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడింది.

మార్చిలో తక్కువగా…మేలో అత్యధికంగా

ఈ ఏడాది మార్చి నెలలో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదయినప్పటికీ ఏప్రిల్ నెలలో మాత్రం సాధారణం కంటే 80 శాతం అధిక వర్షపాతం నమోదయింది. అదేవిధంగా మే నెలలో 376 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. మే నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో భారీగా నమోదయ్యాయి. మరోవైపు ముందస్తుగా రుతుపవనాలు రాకతోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురవడంతో వర్షపాతం గణాంకాలు ఒక్కసారిగా పెరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News