ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తమ స్థావరాలను, లాంచ్ప్యాడ్లను ఖాళీ చేసి పారిపోయిన ఉగ్రవాదులు తిరిగి తమ స్థావరాలకు, లాంచ్ప్యాడ్లకు చేరుకొంటున్నట్లు తమకు పలు సమాచారాలు అందాయని సరిహద్దు భద్రతా దళం( బిఎస్ఎఫ్) మంగళవారం తెలిపింది. దీంతో జమ్మూ, కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ( ఎల్ఒసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మళ్లీ చొరబాటు యత్నాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో భద్రతా ఏజన్సీలు పూర్తి అప్రమత్తగా ఉండాలని బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శశాంక్ ఆనంద్ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతానికి ఉగ్రవాదులు ఎప్పుడు చొరబాటుకు యత్నిస్తారనే దానిపై నిర్దిష్టమైన సమాచారం లేదని, అయితే ఉగ్రవాద సంస్థలు అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు నిరంతరాయంగా సమాచారం అందుతోందని ఆయన చెప్పారు.
ఉగ్రవాదులు తిరిగి తమ స్థావరాలకు వస్తున్నారని, శిక్షణ కూడా పొందుతున్నారని, నిఘా తక్కువగా ఉందని ఎప్పుడయితే భావిస్తారో అప్పుడు చొరబాట్లకు యత్నించవచ్చని ఆయన చెప్పారు. అది ఎల్ఒసి కావచ్చు లేదా అంతర్జాతీయ సరిహద్దు కావచ్చు మన భద్రతా దళాలు అన్ని ప్రాంతాల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన సాయుధ దళాలు ఉగ్రవాదులకు చెందిన కచ్చితమైన లక్షాలపై జరిపిన దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత నెల 10న ఉగ్రవాదుల చేతిలో ముగ్గురు భద్రతా జవాన్లు మృతి చెందినందుకు గుర్తుగా సాంబా సెక్టార్లో ఒక పోస్టుకు ‘సిందూర్’ పేరు పెట్టాలని బిఎస్ఎఫ్ ప్రతిపాదించింది. అలాగే ఆ ఘటనలో మృతిచెందిన ఇద్దరు జవాన్ల పేర్లను మరో రెండు పోస్టులకు పెట్టాలని కూడా నిర్ణయించింది.