మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించనున్నది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు పిటిషనర్ల వాదనలు పూర్తి కాగా, తీర్పును రిజర్వు చేస్తున హైకోర్టు ప్రకటించింది. విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు వెలువడడనుండటంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర పూర్తి కావస్తున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువడుతుందా..? లేక ప్రభుత్వం కోరినట్లు గడువు ఇస్తూ తీర్పు వెలువడుతుందా..? అనే ఉత్కంఠకు బుధవారం తెరపడనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికితమ సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.
బిసిలకు పాత విధానంలోనే రిజర్వేషన్లు..?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్లు అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎస్సి, ఎస్టి, బిసి రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతం మించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్.. ఈ అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
రాష్ట్రంలోని 12,848 గ్రామపంచాయతీలు, 570 మండలాలు, 570 జెడ్పిటిసిలు, 5,817 ఎంపిటిసి స్థానాల వారీగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ పలు సిఫారసులు చేసింది. మొత్తం ఆరు కేటగిరీల్లో రిపోర్టును ప్రత్యేక కమిషన్ తయారు చేసింది. అయితే బిసిలకు ఎంతమేర రిజర్వేషన్లను కేటాయించాలన్నది కమిషన్ సూచించినప్పటికీ.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును మాత్రం అమలు చేయాల్సి ఉంటుంది. 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. బిసిలకు 22.79 శాతం, ఎస్సిలకు 20.53 శాతం, ఎస్టిలకు 6.68 శాతం చొప్పున స్థానాలు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు.స్థానిక సంస్థల్లో ఎస్సి, ఎస్టిలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి.
బిసిలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఏమీలేవు. ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6)ను ప్రకారం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కలిస్తూ వస్తున్నాయి. అయితే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమిళనాడు రాష్ట్ర తరహాలో రాష్ట్రానికి సంబంధించిన బిసి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటులో ఆమోదింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అసెంబ్లీ తీర్మానంపై ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువరిస్తే ఈసారి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
గ్రామాల్లో ఊపందుకోనున్న రాజకీయం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై రాజకీయవర్గాలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తే త్వరలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడమే తరువాయి రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకోనుంది. ఇప్పటికే ఆశావహులు ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. గ్రామాలలో మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలతో నిత్యం సమావేశమవుతున్నారు. గ్రామంలో ముఖ్య నాయకులు, పెద్దలను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి యువత ఉత్సహం చూపుతోంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.