మిస్ వరల్డ్2-025 కిరీటాన్ని గెలుచుకున్న
థాయ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ రెండో
స్థానంలో ఇథియోపియా భామ, మూడో స్థానంలో
పోలెండ్, నాల్గొవ స్థానంలో మార్టినిక్
యువతి ఉత్కంఠగా సాగిన పోటీలో 72వ
ప్రపంచ సుందరి టైటిల్ కైవసం చేసుకున్న
థాయ్ యువతి ఓపల్ సుచాతకు కిరీటం
అలంకరించిన 2024 మిస్వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా
విజేతకు అందనున్న రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ
క్యాన్సర్ను ఓడించి కిరీటాన్ని చేజిక్కించుకున్న
సుచాత నిరాశపరిచిన భారత సుందరి
మిస్ వరల్డ్ కిరీటాన్ని థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ చేజిక్కించుకున్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో 107మంది అందగత్తెలను వెనక్కు నెట్టి, ఆమె అందాల కిరీటాన్ని అందుకున్నారు. చువాంగ్ శ్రీకి మిస్ వరల్డ్ -2024 క్రిస్టినా పిజ్కోవా ప్రపంచ సుందరి కిరీటాన్ని అలంకరించారు. క్యాన్సర్ను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న సుచాత చువాంగ్ శ్రీకి రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనున్నది. విజేతలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
హైదరాబాద్/మన తెలంగాణ: ప్రపంచం యావత్తు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా 72వ ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీకి కిరీటాన్ని సుచాతా చువాంగ్కు ధరించారు. ఈ వేదికపై మిస్ వరల్డ్ సిఈఓ జూలియా మోర్లీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ పోటీల్లో 1వ రన్నర్ అప్గా ఇథియోపియా, 2వ రన్నర్ అప్ మిస్ పోలాండ్, 3వ రన్నర్ అప్గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు. సుచాత థాయ్లాండ్లోని ఫుకెట్లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. శనివారం నగరంలోని హైటెక్స్ వేదికగా సుందరీమణుల ర్యాంప్ వాక్తో ప్రపంచ అందగత్తెల సంబురం అంబరాన్నంటింది. ఈ అందాల పోటీలు బాలీవుడ్, టాలీవుడ్ తారల ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి కిరీటం కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన సుందరీమణులు పోటీ పడ్డారు. చివరిగా 72వ మిస్ వరల్డ్ విజేతగా ఆసియా ఖండం నుంచి
థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ నిలిచి ప్రపంచ సుందరి పోటీల చివరి ఘట్టానికి ముగింపు పలికారు. కాగా పోటీల ఫైనల్ ప్రారంభంలో ఆఫ్రికా నుంచి థియోపియా రెండో స్థానంలో, మూడో స్థానంలో పోలెండ్ , నాలుగవ స్థానంలో మార్టినిక్ నిలిచాయి. ఈ ఫైనల్ పోటీలకు చీఫ్ జడ్జిగా మిస్ వరల్డ్ సంస్థ సిఈఓ జూలియా మోర్లీ వ్యవహరించగా, జడ్జీలుగా సోనూసూద్, సుధారెడ్డి, రానా దగ్గుబాటి, జయేష్ రంజన్, మనూషి చిల్లర్, నమ్రత శిరోద్కర్, డోనా వాల్ష్ వ్యవహరించారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన భారతీయ సంప్రదాయ వస్త్రాలతో కంటెస్టెంట్లు ఆకట్టుకున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు, సతీమణి గీతారెడ్డి, కుమార్తె, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, దాదాపుగా 3500 మంది అతిథులు హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలే పోటీల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు జాక్విలిస్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ ప్రదర్శనల నడుమ హైదరాబాద్ హైటెక్స్లో సందడి నెలకొంది. మొత్తం 108 దేశాల ముద్దుగుమ్మలు స్టేజ్పై ర్యాంప్ వాక్తో అదరగొట్టారు.
టాప్ 8లో పోటీ నుంచి నిష్క్రమించిన మిస్ ఇండియా నందినీ గుప్తా
పోటీల ఫైనల్ ప్రారంభంలో టాప్ 8లో పోటీ నుంచి మిస్ ఇండియా నందినీ గుప్తా నిష్క్రమించారు. టాప్- 8 లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ దేశాలకు చెందిన సుందరీమణులు ఉన్నారు. ఖండాల వారీగా టాప్ 5 నుంచి, ఇద్దరి చొప్పున షార్ట్ లిస్ట్ చేశారు. అమెరికా ఖండం నుంచి బ్రెజిల్, మార్టినిక్, ఆఫ్రికా నుంచి ఇథియోపియా, నమీబియా, యూరప్ నుంచి పోలెండ్, ఉక్రెయిన్, ఆసియా నుంచి ఫిలిప్పీన్స్, థాయిలాండ్లను షార్ట్ లిస్ట్ చేశారు. అనంతరం ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. వీరి నుంచి జడ్జీలు “నువ్వు మిస్ వరల్ అయితే ఏం చేస్తావు” అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారిని చివరి విజేతగా ఎంపిక చేశారు. వీరిలో టాప్ నలుగురిని ఎంపి చేశారు. ఎంపికైన నలుగురిలో అమెరికా ఖండం నుంచి మార్టినిక్, ఆఫ్రికా నుంచి థియోపియా, యూరోప్ నుంచి పోలెండ్, ఆసియా నుంచి థాయిలాండ్ ఉన్నాయి.
మానవతావాది అవార్డు అందుకున్న సోనూ సూద్
మిస్ వరల్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డును ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ టాలీవుడ్ హీరో దగ్గుపాటి రాణా చేతుల మీదుగా అందుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును మిస్ వరల్డ్ నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ముందుగా వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి సోనూ సూద్ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం
హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావటంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. 2025 మిస్ వరల్ విజేతకు మంత్రి జూపల్లి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ అపూర్వ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మిస్ వరల్ సంస్థ, ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందాలు, విభాగాలు సహాయకుల అసమానమైన అంకితభావం, సమన్వయంతో కృషి చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని పేర్కొన్నారు. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే, తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపే అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం సదా సమాయత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.