థాయ్లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ పొరుగుదేశం నేతకు చేసిన ఓ ఫోన్కాల్ లీక్ అవ డం ఆమె పదవికి ఎసరు పెట్టింది. ప్రధాని .. కంబోడియా నేతతో దేశానికి సంబంధించిన విషయాలు చ ర్చించి, మంత్రివర్గ నీతిని ఉల్లంఘించారని, అక్కడి కన్జర్వేటివ్ సెనేటర్ల బృందం ఆరోపించింది. దేశం లోని రాజ్యాంగ నిబంధనలను పేటోంగ్టార్న్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఇటీవల ఆమెపై కేసు దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్ వేటు వేసింది. తుది తీర్పు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆ తీర్పు ఆమెకు వ్యతిరేకంగా ఉంటే పేటోంగ్టార్న్ ప్రధాని పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. థాయ్లాండ్కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్ 2023 వరకు అధికారంలో ఉన్నారు.
ఆ తర్వాత పదవి నుంచి దిగిపోగా, ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. ఇటీవల ఆయనకు థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. అంకుల్ అంటూ ఆయనను సంబోధించిన ఆమె తన దేశం లోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్ ఆర్మీకమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్కాల్ సంభాషణ లీకైంది. సాధారణంగానే కంబోడియా థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండగా, సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్య కాలంలో అవి మరింత దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో ప్రధాని పొరుగుదేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
సొంత పక్షం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు , ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్థాయ్ పార్టీ విడిపోయింది. థాయ్లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె అయిన షినవత్రా.. గతేడాది ఆగస్టులో ప్రధాని పదవి చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె, ఆ దేశ చరిత్ర లోనే అతి పిన్న ప్రధానిగా రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు.