టెహ్రాన్ నగరాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో హెచ్చరించడం, మరో వైపు ఇరాన్ గగనతలం పూర్తిగా తమ అధీనంలో ఉందంటూ ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో జనం పెద్ద సంఖ్యలో నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మంగళవారం తెల్లారే సమయానికే టెహ్రాన్లోని పాతబస్తీ ప్రాంతమంతా ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తోంది. నగరంలోని చాలా దుకాణాలు మూతతపడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలోని పురాతన గ్రాండ్ బజార్ సైతం మూతపడ్డం నగర ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. టెహరాన్నుంచి పశ్చిమం వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి.
చాలా మంది కాస్పియన్ సముద్ర ప్రాంతాలకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కొంత మంది వేరే చోట్లకు కూడా వెళ్తున్నారు. ఇక టెహ్రాన్లోని గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాల పొడవాటి క్యూలు దర్శనమిస్తున్నాయి. టెహరాన్ జనాభా దాదాపు కోటి మంది. అంటే ఇజ్రాయెల్ మొత్తం జనాభాతో దాదాపుగా సమానం. ఇంతమందిని ఖాళీ చేయించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఎలా సాధ్యమనేది అంతుపట్టడం లేదు. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని అంటోంది. అయినప్పటికీ జనంలో మాత్రం భయం పెరిగిపోతూనే ఉంది.