హైదరాబాద్: బిజెపి ఎంపి రఘునందన్ రావుకు (Raghunandan Rao) మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. జూన్ 23వ తేదీన ఎంపికి తొలిసారి బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ను చంపేస్తామని.. దమ్ముంటే కాపాడుకోవాలని బెదిరించారు. దీంతో ఆయన డిజిపి, మెదక్, సంగారెడ్డి ఎస్పిలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు ప్రభుత్వం ఎస్కార్ట్ వాహనంతో పాటు అదనపు సిబ్బందితో రక్షణ కల్పించింది.
తాజాగా ‘ఆపరేషన్ కగార్’నే ఆపేయాలంటూ రెండు వేర్వేరు నెంబర్ల నుంచి రఘునందన్కు (Raghunandan Rao) గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఎపి మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు రంగంలోకి దిగాయని అన్నారు. తమ టీంలు హైదరాబాద్లో ఉన్నాయని.. మరికాసేపట్లో చంపేస్తామని.. దమ్ముంటే కాపాడుకోవాలని వాళ్లు బెదిరించారు. తమ ఫోన్లు ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తే.. తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని ధైర్యంగా పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిని వదలమని హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం రఘునందన్ రావు యశోద ఆస్పత్రిలో కాలికి చికిత్స చేయించుకున్నారు. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన హాస్పిటల్ నుంచే పోలీసులకు ఫిర్యాదు చేశారు.