183 గ్రాముల కొకైన్, 44 ఎండి ఎక్స్టాసీ ట్యాబ్లెట్స్
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.26,28,000
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు తెచ్చిన డ్రగ్స్ను సైబరాబాద్ మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 183 గ్రాముల కొకైన్, 44 ఎండి ఎక్స్టాసీ ట్యాబ్లెట్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.26,28,000 ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన జూడు అలియాస్ క్రిస్ గోవాలో ఉంటున్నాడు. హైదరాబాద్లోని టోలీచౌకికి చెందిన మహ్మద్ అష్రఫ్ అరబిక్ ట్యూటర్గా పనిచేస్తున్నాడు. బాచుపల్లి, నిజాంపేటకు చెందిన రామేశ్వర్ శ్రావణ్ కుమార్, ఎపిలోని ప్రకాశం జిల్లా, అన్మంబట్లవారి పాలెంకు చెందిన గోరెంట్ల చరణ్తేజ నగరంలోని కొండాపూర్లో ఉంటున్నాడు.
రామేశ్వర్ నుంచి గ్రాము, చరణ్తేజ నుంచి 2 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. అరబిక్ ట్యూటర్గా పనిచేస్తున్న అష్రఫ్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయించేందుకు గోవాలో ఉంటున్న జూడును ఆర్డర్ ఇచ్చాడు. అతడు డ్రగ్స్ తీసుకుని నగరానికి వచ్చాడు. డ్రగ్స్ను అష్రఫ్కు ఇచ్చాడు, ఈ విషయం తెలియడంతో శ్రవణ్కుమార్, చరణ్తేజ సంప్రదించి డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఈ విషయం తెలియడంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది 202 కేసులు
ఈ ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 202 డ్రగ్స్ కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందులో గంజాయి 1,770.8 కిలోలు, గంజాయి చెట్టు 124, గంజాయి ట్యాబ్లెట్లు 14, హష్ ఆయిల్ లేదా వీడ్ ఆయిల్ 8.55, లైరికా 150 మిల్లీ గ్రాములు, అల్ఫాజోలూమ్ 140 కిలోలు, ఎండిఎం 116..29 గ్రాములు, ఓపియం 200 గ్రాములు, ఎక్స్టాసి 61 ట్యాబ్లెట్లు, ఎల్ఎస్డి పేపర్స్ మూడు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 23మందిపై పిడి యాక్ట్ పెట్టామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి,డ్రగ్స్ను అడ్డుకోవడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.