ఇరాన్ లో ముగ్గురు భారతీయులు ఆచూకీ తెలియడం లేదు. భారతీయ రాయబార కార్యాలయం వారి కుటుంబాలను సంప్రదిస్తోంది. ముగ్గురు కిడ్నాప్ అయినట్లు అనుమానిస్తున్నారు. వారు పంజాబ్ లోని సంగ్రూర్ కు చెందిన హుషన్ ప్రీత్ సింగ్, హోషియార్ పూర్ కు చెందిన అమృత్ పాల్ సింగ్, ఎస్ బిఎస్ నగర్ కు చెందిన జస్పాల్ సింగ్ . మే 1న ఇరాన్ రాజధాని తెహరాన్ లో విమానం దిగిన తర్వాత నుంచి వారి ఆచూకీ తెలియడం లేదు. భారతీయ రాయబార కార్యాలయం వెంటనే తెహరాన్ లోని అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తెలిపింది. వారిని గుర్తించి వారి భద్రతకు హామీ ఇవ్వాలని కోరినట్లు భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.పంజాబ్ లోని ఓ ట్రావెల్ ఏజెంట్ ఈ ముగ్గురిని దుబాయ్ -ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతామని హామీ ఇచ్చి వారిని మొదట ఇరాన్ కు పంపారు.
ఇరాన్ లో వారికి బస ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ, ఇరాన్ లో మే1న అడుగుపెట్టిన వెంటనే కిడ్నాప్ కు గురయినట్లు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్లు ఒక కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఆ ముగ్గురిని బంధించిన ఓ వీడియాను కిడ్నాపర్లు పంపారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ వీడియోలో వారు ముగ్గురిని పసుపు రంగు తాళ్లతో కట్టేసి ఉన్నాయి. చేతులనుంచి రక్తం కారుతున్నట్లు ఉంది. కోటి రూపాయలు చెల్లించకపోతే వారిని చంపివేస్తామని కూడా కిడ్నాపర్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితులు కిడ్నాపర్ల ఫోన్ ద్వారా కుటుంబసభ్యులతో మాట్లాడే వారు. మే 11 నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫోన్లు రాలేదు. వారు ముగ్గురిని ఇరాన్ కు పంపిన హోషియార్ పూర్ ఏజెంట్ జాడ కూడా తెలియడం లేదు. దీంతో ఏజెంట్ పై మే 16న ఎఫ్ఐఆర్ నమోదు అయింది.