యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. 38 ఏళ్ల క్రితం వచ్చిన ‘నాయకుడు’ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. ‘థగ్ లైఫ్’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో తెలుసుకుందాం.
సినిమా కథః
రంగరాయ శక్తి రాజు (కమల్ హాసన్) తన అన్న మాణిక్యం (నాజర్)తో కలిసి ఢిల్లీలో గ్యాంగ్స్టర్గా ఒక గ్యాంగ్ను నడుపుతుంటాడు. సదానంద్ (మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్తో గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఓ సందర్భంలో శక్తి రాజు ఒక చిన్నారిని (శింబు) కవచంగా ఉపయోగించి తప్పించుకుంటాడు. ఆ రోజు నుంచి ఆ చిన్నారి అమర్ (శింబు)ను సొంత కొడుకులా పెంచుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం తనపై జరిగిన దాడిలో శక్తి రాజు… అమర్పై అనుమానం వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో తన తండ్రిని చంపింది శక్తి రాజేనని తెలుసుకున్న అమర్, శక్తి రాజును ఒక లోయలోకి తోసేస్తాడు. చనిపోయాడు అనుకుని తిరిగి వచ్చి అతని సామ్రాజ్యం అంతటినీ తన అదుపులోకి తెచ్చుకుంటాడు. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శక్తి రాజు మళ్ళీ తిరిగి తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడా? లేదా? చిన్నప్పుడే తప్పిపోయిన అన్న చెల్లెలు అమర్, చంద్ర (ఐశ్వర్య లక్ష్మి) మళ్లీ కలిసారా? లేదా? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
డాన్గా ఎదిగిన తమ్ముడిని చూసి ఓర్వలేని ఓ అన్న, అతను చెప్పిన మాటలు విని పెంచి పెద్ద చేసిన మనిషిపై ప్రతీకారం తీసుకునే ఓ యువకుడు.. ఈ నేపథ్యంలో సినిమా కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ప్రారంభం బావుంది. ఓ బిల్డింగ్లో డాన్ని పట్టుకోవడానికి పోలీసులు చేసే ఫైరింగ్, తండ్రిని, చెల్లిని పోగొట్టుకున్న ఓ బాలుడిని దగ్గరకు తీసుకుని తనతోనే ఉంచుకోవడం, అక్కడి నుంచి అల్లుకున్న క్యారెక్టర్స్ కథపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. నటనలో విశ్వరూపం చూపించే కమల్ హాసన్ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు డిఫరెంట్ వేరియేషన్స్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్తో పాటు కొన్ని యాక్షన్, ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో కమల్ హాసన్ చాలా బాగా నటించాడు.
అలాగే తన లుక్స్తో కూడా కమల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. మరో కీలక పాత్రలో నటించిన శింబు నటన ఆకట్టుకుంది. కమల్, శింబు మధ్య ఎమోషనల్ డ్రామా కూడా బాగుంది. హీరోయిన్గా త్రిష మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చక్కగా నటించింది. అభిరామి నటన బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో మరో కీలకమైన పాత్రలో కనిపించిన ఐశ్వర్య లక్ష్మి కూడా చక్కగా నటించి ఆకట్టుకుంది. నాజర్ కూడా తన పాత్రలో విభిన్నంగా నటించి మెప్పించాడు. మిగిలిన నటీనటులు అశోక్ సెల్వన్, జోజు జార్జ్, అలీ ఫజల్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు మణిరత్నం రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచింది. కమల్హాసన్, మణిరత్నం కాంబినేషన్లో 38 ఏళ్ల క్రితం వచ్చిన నాయకుడు చిత్రాన్ని మరిచిపోయేలా చేసింది ‘థగ్లైఫ్’.