Monday, September 15, 2025

గ్రేటర్‌లో.. రూ. 5లకే టిఫిన్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మహానగరంలో అర్థాకలితో ఉన్నవారికి రూ.5లకే భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్న జీహెచ్‌ఎంసి ఇప్పుడు రూ. 5లకే టిఫిన్స్‌ను కూడా అందించి వారికి మద్దతుగా నిలవనున్నది. వచ్చే నెల ఆగష్టు 15న ఈ టిఫిన్స్ కేంద్రాలను ప్రారంభించి పేదలకు అల్ఫాహారం అందించేందుకు సన్నాహాలను జీహెచ్‌ఎంసి పూర్తిచేసింది. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు, అడ్డాకూలీలతో పాటు చాలా మంది వివిధ రకాల పనులమీద నగరానికి వస్తూ ఆహారం కోసం తిప్పలు పడుతుంటారు. కొందరు ఉదయాన్నే నగరానికి బయల్దేరి ఆకలితోనే పనులు మొదలు పెట్టి, మధ్యాహ్నాం తాము తెచ్చుకున్న భోజనం తిని, కడుపు నింపుకుంటున్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ వారికి కేవలం రూ.5 కే టిఫిన్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ స్కీమ్ ను స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నెల 15వ తేదీ నుంచి ఇందిరమ్మ టిఫిన్స్ పేరుతో ప్రారంభించాలని జీహెచ్‌ఎంసి కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కమిషనర్ యోచిస్తున్నట్లు సమాచారం.

60 కేంద్రాలల్లో..
నగరంలో తొలి దశగా 60 స్టాళ్లలో ఇందిరమ్మ టిఫిన్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని కర్ణన్ నిర్ణయించినట్టు సమాచారం. ఎల్‌బీనగర్ జోన్‌లో 22, చార్మినార్ జోన్‌లో 25, ఖైరతాబాద్ జోన్‌లో 35, శేరిలింగంపల్లిజోన్‌లో 15, కూకట్‌పల్లి జోన్‌లో 23, సికింద్రాబాద్ జోన్‌లో 30 ఇందిరమ్మక్యాంటీన్‌లు అమలు చేయనున్నారు. ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నందున ఏకంగా షుగర్‌లెస్, పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు బల్దియా ఈ టిఫిన్స్ అందించాలనే నిర్ణయానికి ఓకారణమని తెలిసింది.ఒక్కోరోజు ఒక్కొక్క వెరైటీ టిఫిన్స్ అందించేందుకు ప్లాన్ రూపొందించింది.

వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు జీహెచ్‌ఎంసీ మెనూను సిద్దం చేసుకుంది. తొలి దశగా రూ.11.43 కోట్ల వ్యయంతో సిటీలో 130 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ప్రతి టిఫిన్ స్టాల్ లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ టిఫిన్స్ ఒక వరంలా మారనున్నాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఈ ఇందిరమ్మ టిఫిన్స్ స్కీమ్ కీలక పరిణామం కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఆరోగ్యమే లక్ష్యంగా మెనూ..
రూ.5 కే టిఫిన్స్ అందించి ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ మిల్లెట్స్ తో తయారు చేసే టిఫిన్ల మెనూను రూపొందించింది. వారంలో ఆరు రోజుల పాటు ఉదయం అందించే టిఫిన్ ఐటమ్స్, వాటితో పాటు ఇచ్చే ఇతర ఐటమ్స్ ల వివరాలు రోజు వారీగా ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్‌ఎంసీ రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా వంటి రోజుకొకటి వినూత్నంగా టిఫిన్లను ప్రజలకు అందిస్తారు. పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ కు రూ 19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ్రప్రజల నుంచి వసూలు చేస్తుండగా, మిగిలిన రూ. 14ను జీహెచ్‌ఎంసీ భరించనుంది.

రోజు అల్పాహారం
సోమవారం:  మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
మంగళవారం: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
బుధవారం:  పొంగల్, సాంబార్, చట్నీ
గురువారం:  ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
శుక్రవారం:  పొంగల్, సాంబార్, చట్నీ
శనివారం:  పూరీ (3), ఆలూ కూర్మా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News