మనతెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి: ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండలం ఎల్లూరు ఆటవీ సమీపంలో పెద్దపులిని (కె8) హతమార్చిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తామని ఎఫ్డిపిటి శాంతారాం అన్నారు. శనివారం కాగజ్నగర్లోని ఆటవీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డిఎఫ్ఓ నీరజ్కుమార్తో కలిసి మాట్లాడారు. గత కొన్ని రోజుల క్రీతం పెద్దపులిని కొందరు వేటగాళ్లు విద్యుత్ షాక్తో హతమార్చరని, దీనిపై విచారణ త్వరలోనే గుర్తించి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పులిని కరెంట్ షాక్తో హతమార్చిన అనంతరం కేటుగాళ్లు 200 మీటర్ల వరకు మోసుకెళ్లి అనంతరం చర్మం, గోళ్లను తీసుకొని, కళేబరాన్ని పాతిపెట్టారని వివరించారు.
వన్యప్రాణులపై దాడి చేసిన, హతమార్చిన వారికి శిక్ష తప్పదని అన్నారు. 15 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15న గిరిజనలు తునికాకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. కళేబరం కనిపించడంతో భయంతో వెనుదిరిగారు. వెంటనే అటవీ అధికారుల సమాచారం తెలియడంతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా రక్తపు మరకలు, వెంట్రుకలు ఆధారంగా పులిని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. పులి శరీర భాగాలను ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. కె8 పులి గత రెండు నెలల నుంచి బెజ్జూరు అటవీ ప్రాంతంలోని మత్తడి వద్ద సంచరిస్తోంది. పులి ఎప్పుడ మత్తడి నీటి ఊటల వద్దల ఉంటుందని అధికారులు అనుకున్నారు. కానీ పులి మాత్రం ఆగర్ గూడ పాత చిచ్చల ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలో సంచరించింది. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో పులి చనిపోయింది. ఈ పులి 2021లో మూడు పిల్లలకు జన్మనిచ్చింది.