కోల్కతా: స్కూల్ జాబ్స్ స్కామ్ కేసులో అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కోర్టు షాకిచ్చింది. ఆయనకు ఆగస్టు 30 వరకు ఆరు రోజుల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రిమాండ్ విధించింది. పశ్చిమ బెంగాల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ముర్షిదాబాద్లోని సాహా నివాసంలో గత బుధవారం ఈడీ విస్తృత సోదాలు జరిపి ఆయనను అరెస్టు చేసింది. అధికారుల వివరాల ప్రకారం.. ఇడి దాడుల సమయంలో సాహా గోడ దూకి తన నివాసం నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. తన మొబైల్ ఫోన్లను కూడా సమీపంలోని కాలువలోకి విసిరాడు. తరువాత అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గోడ దూకి పారిపోయే ప్రయత్నంలో చెత్తకుప్పలో పడిపోయిన ఎమ్మెల్యేను ఇడి అధికారులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
కాగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సహకరించనందుకు బుర్వాన్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అతని నివాసంతో పాటు, అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ సోదా చేసింది. 2023లో ఇదే కుంభకోణంలో సాహాను సిబిఐ అరెస్టు చేసింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనను విడుదల చేసింది.