న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మొయిత్రా(50), బిజు జనతాదళ్(బిజెడి) నేత, మాజీ ఎంపి పినాకి మిశ్రా(65)ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం జర్మనీలో రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వీరి నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.. కానీ, సంప్రదాయ దుస్తులు ధరించిన వీరిద్దరు చేతులు పట్టుకుని నడుస్తున్న ఫోటో బయటకు వచ్చింది. దీంతో వీరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మహువా పెళ్లి విషయంపై టిఎంసి కూడా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మహువా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్ను వివాహం చేసుకుంది. తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది.
మహువా ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా రెండవసారి పనిచేస్తున్నారు. ఆమె మొదటిసారి 2019లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు, అక్కడ ఆమె బిజెపి అభ్యర్థి కళ్యాణ్ చౌబేను ఓడించారు. ఇక, 2024 ఎన్నికలలోనూ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి బిజెపికి చెందిన అమృత రాయ్ను ఓడించి రెండోసారి పార్లమెంటుకు వెళ్లారు.