రాంచీ: జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కోటి రూపాయల రివార్డు ఉన్న సహదేవ్ సోరెన్ అనే మావోయిస్టు సహా మొత్తం ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సహదేశ్ అలియాస్ ప్రవేశ్ నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఆయనతోపాటు హతమైన మరిద్దరు మావోయిస్టులు రఘునాథ్ హేమంబ్రం అలియాస్ చంచల్, బీర్సేన్ గంఝు. రఘునాథ్ ఆ సంస్థ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉంది.
కాగా గంఝు జోనల్ కమిటీ సభ్యుడు. ఆయనపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి అనేక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ వ్యతిరేక సంయుక్త ఆపరేషన్లో కోబ్రా, హజారీబాగ్ పోలీసులు, గిరిదిహ్ పోలీసులు పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు, పక్కా సమాచారంతోనే పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. కాగా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. గత రెండు రోజుల్లో జార్ఖండ్లో జరిగిన రెండో ఎదురుకాల్పుల ఘటన ఇది.