జ్యోతి మల్హోత్రా పేరు ఇప్పుడు భారతదేశం అంతటా ప్రతిధ్వనిస్తుంది. ఆకర్షణీయ రూపురేఖలతో, చక్కటి ఉచ్చారణతో, మంచి వాగ్ధాటితో ఎంతటివారినైనా ఇట్టే ఆకర్షించే శక్తిసామర్థ్యాలు గల జ్యోతి మల్హోతా, పర్యాటక ప్రాంతాలకు దూసుకెవెళ్లి, వార్తా విశేషాలను కవర్ చేస్తూ వాటిని వీడియోల ద్వారా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ వీక్షకుల మన్ననలు పొందిన ట్రావెల్ యూట్యూబర్గా పేరు పొందింది. ఆమె ఇప్పుడు అనేక ఆరోపణలతో చిక్కుల్లోపడింది. ఆమె పాకిస్తానీ నెంబరు 1 గూఢచారిణి అని కొందరు అంటున్నారు. ఈ విషయం తెలిసిందే తడవుగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ సైనిక ఇంటలిజెన్స్ వర్గాల పరిశోధనా సంస్థలు అనేక విషయాలతోపాటు యూట్యూబర్ల కార్యకలాపాలపై కూడా విచారణ చేశాయి. ఈ సందర్భంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహ కుట్రల ఆనువాళ్ళ చరిత్ర బయటపడినట్లు తెలుస్తోంది.
మనదేశంలో బతుకుతూ తన ట్రావెలర్ యూట్యూబర్ వృత్తిలో భాగంగా అనేక ఆకర్షణీయమైన, కీలకమైన ప్రదేశాలను పర్యటిస్తూ, ముఖ్యమైన కట్టడాల వీడియోలు తీసి పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ముఖ్య అధికారులతో సంబంధాలు పెట్టుకొని, వారితో సంప్రదింపులు జరిపి మన దేశానికి చెందిన కీలక సమాచారం అందించిందని అందులోనూ సైనిక స్థావరాల సమాచారం కూడా ఉందట. ఇందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో లంచం అందుకుంటూ వస్తుందట. ఇప్పుడు ఈ యూట్యూబర్ను భద్రతా బలగాలు తగిన ఆధారాలతో అరెస్టు చేసింది. ఆమెపై ఇంటరాగేషన్ ఇంకా జరుగుతున్నది.ఇంకా సంపూర్ణ సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఆమెకు ట్రావెల్ విత్ జో అనే పేరుగల యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె మొదట్లో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో సంచరించింది. తాను హర్యానా, పంజాబీని అని పరిచయం చేసుకుంది. 33 ఏండ్ల ఈ యూట్యూబర్కు ఇప్పటికే 3 లక్షల 85 వేలకు పైగా ఖాతాదార్లు ఉన్నారు.
ఆమె పర్యాటక వీడియోలకు ప్రజాదరణ దక్కింది. ఫలితంగా ఆమెలో తక్కువ సమయంలో అధిక ధనం, ఆస్తులు సంపాదించుకోవాలి అనే కోరిక పెరిగింది. దీనితో ఆమె తన వృత్తి ధర్మాన్ని వదిలిపెట్టి దేశంలో కీలక ప్రదేశాలు, కట్టడాలను వీడియోలు తీసి మన శత్రుదేశం పాకిస్తాన్ ఏజెంట్లుకు చేర వేసిందట. ఈ క్రమంలో పలు దేశాలను స్పెషల్ క్లాస్ విమానాల్లో పర్యటించింది. అమెరికా, చైనా, పాకిస్థాన్ వంటి పలు దేశాల్లోని విలాసవంతమైన హోటళ్లలో ఉంటూ అక్కడ ఉన్న సీక్రెట్ స్థలాలు పర్యటించింది. ఆమె అందం, చురుకుదనం అన్నింటిని చూసి పాక్ సమాచార అధికారులు ఆమెను తమ ఏజెంటుగా వాడుకున్నారని పోలీసులు తెలిపారు. ఆమె తెగువతనం చివరికి ఆమెను ఏజెంటుగా చేసిందని కేసు దర్యాప్తులో ఉన్న ఎస్పి శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. ఆమెకు ఉన్నత స్థాయిలో కనెక్షన్లు లేవని, రహస్య సమాచారం తెలిపే సరైన వనరులుకాని, వ్యక్తుల పరిచయాలు కాని లేనని పాక్ రహస్య గూఢవార సంస్థల అధికారులకు కూడా తెలుసు. అయితే ఆమెకున్న చొరవతో ఈ దిశలో ఆమెను తమ కీలక పాత్రధారిగా చేసుకోవచ్చునని నిర్ధారించుకుని ఆమెను రంగంలోకి దింపినట్లు తెలిసింది. పాకిస్తానీ అధికారులను ఏ విధంగా కలిశారనేది కీలక విషయం అయింది.
ఆ దిశగా పరిశోధన సాగుతోంది. ఆపరేషన్ సిందూర్ తరువాత న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయంలో ఆమె పాక్ అధికారి డానిష్ను కలిసింది. అంతకు ముందు ఆమె పలు సార్లు పాకిస్తాన్కు వెళ్లిరావడం, చివరికి పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా ఆమె అక్కడ ఓ అతిథి గృహంలో మకాం వేసి ఉండటం వంటి విషయాలను ఇప్పుడు మన ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆమెకు చెందిన పలు ఫోన్లు, యూట్యాబ్లు, ల్యాప్ ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో మారు పేర్లతో పాకిస్తాన్ రాయబార కార్యాలయం సిబ్బంది పేర్లు ఉన్నాయట. గత ఏడాది మార్చిలో ఆమె పాకిస్తాన్కు వెళ్లి వచ్చింది. పైగా పర్యాటకం మునుగులో ఓ వీడియో వెలువరించింది. అప్పట్లో ఆమె పాకిస్తాన్ పర్యటనలో భాగంగా తీసిన వీడియోలో ఆమె పాకిస్తాన్ను అదే పనిగా కొనియాడిందని భద్రతా అధికారులు గుర్తించారు.
పాకిస్తాన్లో పర్యటించినప్పుడు. ఆమె 2023లో పది రోజుల పాటు పార్టీలు, విందులు, వినోదాలతో విలాసవంతంగా గడిపిందిట. అక్కడ ఆమె బస పర్యటనల బాధ్యతను అక్కడి కీలక వ్యక్తి అలీ ఆహవాన్ చూశారని వెల్లడైంది. దేశంలోని పలు ప్రాంతాలు ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్లో కూడా ఆమె యూట్యూబర్గా పర్యటించినట్లు కొందరు ప్రముఖులతో పరిచ యాలు పెంచుకున్నట్లు వెల్లడైంది. దేశంలో ఇప్పటికీ దాదాపు డజన్ కు పైగా రహస్య ఏజెంట్లు వివిధ ప్రాంతాలలో పట్టుబడ్డారు. పాకిస్తాన్ కు కీలక సైనిక రహస్య సమాచారం చేరవేతల అభియోగాలతో ఇంటలిజెన్స్ వర్గాల నిఘాలో పట్టుబడ్డ వారిలో ట్రావెటర్ యూట్యూబర్ జ్యోతి, ఇతరులు అనేకులు ఇప్పటివరకూ అరెస్టు అయ్యారు. వారిపై ఇంటరాగేషన్ జరుగుతుంది. పాకిస్థాన్ ఇరుగు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారే ఈ పట్టుబడ్డవారిలో ఉన్నారని అధికారిక ప్రకటనలతో వెల్లడైంది. పహల్గాం ఉగ్రదాడి, తరువాత ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఇంటలిజెన్స్ వర్గాల నిఘాలో ఈ పాకిస్తాన్ ఏజెంట్లను అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి ఆరుగురు, హర్యానా నుంచి ఐదుగురు, యుపి నుంచి ఒక్కరు ఇప్పటి వరకు పట్టుబడ్డారు. అన్వేషణ కొనసాగుతున్నది. అనేక రహస్య సమాచారం వెల్లడి కావల్సి ఉంది.
డా. కోలాహలం
రామ్ కిశోర్
98493 28496