Saturday, May 31, 2025

జి.ఒ నెం. 3ను పునరుద్ధరించాలి

- Advertisement -
- Advertisement -

ఆదివాసీ సమాజాన్ని, ఆదివాసీ అస్తిత్వాన్ని, ఆదివాసీ ఆత్మగౌరవాన్ని అంతం చేసేందుకు ఏజెన్సీలోకి వలసవాదులు, గిరిజనేతరులు క్రమక్రమంగా ఏజెన్సీ హక్కులు, చట్టాలను కాలరాస్తూ అన్ని విధాలుగా కొల్లగొడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు దక్కవలసిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సైతం ఆక్రమిస్తూ ఆదివాసుల నోటి దగ్గర ఉన్న కూడు కూడా లాక్కుంటున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఏజెన్సీ 5వ షెడ్యూల్ భూభాగంలో అడవి బిడ్డల హక్కులను, భూములను, రిజర్వేషన్లను దర్జాగా అనుభవిస్తున్నారు. ఏజెన్సీలో జి.ఒ నెం. 3 సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించి సామాజిక న్యాయాన్ని సమాధి చేశారు. ఆదివాసులు, అడవి బిడ్డలు నాగరికత సమాజానికి దూరంగా జీవిస్తూ అనుక్షణం దినదిన గండంగా తమ మనుగడ కోసం, అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాటి ఆదివాసీల పోరాటాలను చూసి చలించిపోయి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

1986 సంవత్సరంలో జి.ఒ నెం. 275ను జారీ చేశారు. ఆదివాసీ, అడవి బిడ్డలకు 100% రిజర్వేషన్ అవకాశాన్ని కల్పిస్తూ మరో 18 జిఒలను కూడా జారీ చేశారు. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలలో ఏజెన్సీ టీచర్లు, విఆర్‌ఒ, విఆర్‌ఎ, ఎఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్లు, డిప్యూటీ సర్వేయర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీస్ శాఖ, ఆశ్రమ పాఠశాల అసిస్టెంట్లు, వంట మనిషి, కమాటీ, వాచ్‌మెన్, స్వీపర్లు వివిధ ఉద్యోగాల్లో సుమారు 50 వేల మంది ఆనాటి ఆదివాసీ నిరుద్యోగ యువత ఉద్యోగాల ద్వారా లబ్ధి పొందారు. 1998వ సంవత్సరంలో జి.ఒ నెం. 275ను కొందరు వలసవాద గిరిజనేతరులు అక్రమంగా చట్టవిరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి రద్దు చేయించారు. 1998లో గిరిజన సంక్షేమ పరిషత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 275 జిఒను పునరుద్ధరించాలని ఆదివాసీ సమాజం ఉవ్వెత్తున ఉద్యమాలను ఉధృతం చేశారు.

ఆ ఉద్యమాలను చూసిన ఆదివాసులపై అభిమానంతో ఆనాటి జిల్లా కలెక్టర్ గిరిధర్ 275 జిఒ స్థానంలో మరో జిఒను రూపొందించాలని గిరిజన సంక్షేమ శాఖకు సిఫార్స్ చేశాడు. కలెక్టర్ సిఫారసులను పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ 275 జిఒ స్థానంలోనే జి.ఒ నెం. 3ను 10- జనవరి- 2000 సంవత్సరం జారీ చేసింది. ఆదివాసీ సమాజంలో ఆదివాసులకు, ఆదివాసులచే విద్యని బోధించడం, నిరుద్యోగాన్ని తొలగించడం ముఖ్యఉద్దేశం. కానీ ఆచరణలో వలసవాదులైన లంబాడీలకే అత్యధిక ఉద్యోగాలు పొందిన చరిత్ర సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఫలితంగా ఆదివాసీ సమాజంలో ఉపాధి, ఉద్యోగలు ఇక పగటి కలగానే మారే అవకాశం ఉంది. ఆదివాసులకు 100% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ సగం చట్టవిరుద్ధంగా వలస వచ్చిన లంబాడీలు దోచుకున్నారు. ఏమాత్రం ఆదివాసులకు ఉపాధి, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 (2) ప్రకారం వలసవాదులు, గిరిజనేతరులు ఏజెన్సీలో నివసించడానికి అవకాశం లేనప్పుడు అదే ఏజెన్సీలో ఉద్యోగాలు ఎలా చేస్తారో? ఆదివాసులకు ప్రస్తుతం పాలిస్తున్న రాజకీయ పార్టీలు, న్యాయస్థానాలు సమాధానం చెప్పాలి.

సుప్రీం కోర్టు సమత జడ్జిమెంట్‌లో ఏజెన్సీలో కూడా ప్రభుత్వాన్ని గిరిజనేతరుడు గానే చూడాలని తీర్పు వెలువరించిన విషయం మర్చిపోయారా..? 2001న జి.ఒ నెం. 3 నీ సమర్థిస్తూ హైకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఆదివాసులు కనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్‌ను సుప్రీం కోర్టులో గిరిజనేతరులైన బోడ వెంకటేశ్వర్లు, లీలా ప్రసాదులు సవాల్ చేశారు. 2002 సంవత్సరంలో జరిగిన సుప్రీం కోర్టు వాదనలు గిరిజనేతరులకు స్టే ఇచ్చుటకు నిరాకరించింది. సుప్రీం కోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలాలు చేయడం వల్ల 2000 సంవత్సరం నుండి 2008 వరకు ఏజెన్సీ డీఎస్సీలను యధావిధిగా కొనసాగించారు. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 జిల్లాలలో సుమారు 2000 వేలకుపైగా ఆదివాసులు ఉపాధ్యాయులుగా నియామకాలు పొందారు.

అనంతరం వలసవాదులు, గిరిజనేతరులు కుట్రలు కుయుక్తాలతో జి.ఒ నెం. 3 ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీం కోర్టు 22 ఏప్రిల్ 2020న రద్దు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు అందనంత దూరంగా అడవులకు పరిమితం చేసింది. నాటి నుంచి నేటి వరకు ఆదివాసీ హక్కుల కోసం.. ఆత్మగౌరవం కోసం ఆదివాసీ ప్రజలు ఆగ్రహంతో అనేక ఉద్యమాలు పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో మా ఊర్లో మా రాజ్యం… మా ఉద్యోగాలు మాకే కావాలి అంటూ ఆదివాసీ ఐక్య సంఘాల జెఎసి, ఆదివాసీ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీల ఆధ్వర్యంలో మన్యంలో మరో పోరాటానికి సిద్ధమయ్యారు. బందులు, రాస్తా రోకోలు, నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, రైల్ రోకోలతో ఉద్యమ ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి.

సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతంలోని స్థానిక ఆదివాసులకే ఉద్యోగా అవకాశాలు కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అంతేకాదు సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిస్తూనే రద్దు అయిన జి.ఒ నం:3ను పునరుద్ధరించేందుకు చట్టపరమైన అడ్డంకులపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి సీతక్క ఆదివాసీ బిడ్డగా చొరవ తీసుకొని తమ ఆదివాసీ బిడ్డల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు అటు ప్రభుత్వం, ఇటు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో జి.ఒ నెం. 3కు పునర్జీవం పొయ్యాలని ఆదివాసీ నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, ఆదివాసీ సమాజం కోరుకుంటుంది.

  • సాగబోయిన
    పాపారావు
    99898 28774
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News