Tuesday, June 17, 2025

అధికారులపై తిరగబడిన గిరిజనులు

- Advertisement -
- Advertisement -

అటవీభూముల్లో వేసిన
గుడిసెలను తొలగించడానికి
వచ్చిన అధికారులపై కారం,
కర్రలతో దాడి ములుగుజిల్లా
ఏటూరునాగారంలో
పరిధిలో ఘటన

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి/కన్నాయిగూడెం: ములుగు జిల్లా, ఏటూరునాగారం రొయ్యూరు నార్త్ రేంజ్ అటవీ శాఖ అధికారులపై గిరిజనులు సోమవారం దాడులకు దిగారు. సంఘటనకు దారితీసిన వివరాలు ఇలావున్నాయి. గత ఏడాది కాలంగా ఏటూరునాగారం మండలం, నార్త్ రేంజ్ అటవీ శాఖ పరిధిలోని రొయ్యూర్ బీట్, రొయ్యూర్ సెక్షన్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో కొంతమంది గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే ఇటీవల పలుమార్లు అక్రమంగా అటవీ అధికారులు హెచ్చరికలు చేసి గుడిసెలను తొలగించినా మళ్లీ గుడిసెలు నిర్మిస్తూ అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో అక్రమంగా గుడిసెలు వేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అధికారులు గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు.

సోమవారం ఉదయం అటవీ అధికారులపై గిరిజనులు తిరగబడగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు గిరిజనులు అధికారులపై కారం పొడి చల్లుతూ.. కర్రలతో దాడులకు దిగారు. దీంతో ప్రాణభయంతో అధికారులు పరుగులు తీశారు. ఇదే క్రమంలో గుడిసెలు కూల్చివేయడానికి వచ్చిన జెసిబి వాహనంపై గిరిజనులు దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి. జెసిబి డ్రైవర్‌పై కత్తితో దాడి చేయగా గాయపడినట్టు సమాచారం. కాగా, అటవీ ప్రాంతంలో పరిస్థితి విషమించడంతో వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News