Saturday, June 28, 2025

అటు రణదాహం.. ఇటు నోబెల్ మోహం

- Advertisement -
- Advertisement -

నోబెల్ శాంతి బహుమతిని ఎలాగైనా పొందాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. పదవిలోకి రాక ముందు ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపుతానని హామీ ఇచ్చినా ఆయన అధికార పగ్గాలు పట్టిన తరువాత ఏమీ చేయలేకపోయారు. పైగా కొన్ని దేశాల వైపు మద్దతుగా నిలిచి యుద్ధాలను మరింత ప్రేరేపించడమే కాదు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడం వివాదాలకు దారి తీస్తోంది. దీనికి ఉదాహరణ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే. నోబెల్ బహుమతికి అర్హతలను పరిశీలిస్తే దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేయడం, సాయుధ దళాలను తక్కువగా వినియోగించడం, శాంతి కోసం అంకిత భావంతో కృషి చేయడం తదితర లక్షాలను సాధించిన వారికే నోబెల్ శాంతి బహుమతి పొందడానికి అర్హత ఉంటుందని నోబెల్ బహుమతి సంస్థాపకులు ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో స్పష్టం చేశారు. దీన్ని బట్టి ట్రంప్‌కు ఆ అర్హత ఉందా అన్నది ప్రశ్నార్థకం.

డొనాల్డ్ ట్రంప్ శాంతి కాముకుడు కాదు. పదవిలో లేనప్పుడు ఆయన యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తానే అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యేది కాదని బీరాలు పలికారు. అమెరికా శాశ్వత యుద్ధాలకు అమెరికాలోని ప్రపంచవాదుల వైఖరిని ట్రంప్ సిద్ధాంతం తప్పుపట్టింది. అమెరికా ఇరాన్ చర్చల్లో ఉంటుండగా ట్రంప్ నిఘా వ్యవస్థ, శ్వేతభవనం అత్యంత సన్నిహితుడు ఇజ్రాయెల్ నాయకత్వం కలిసి జూన్ 13న ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. మొట్టమొదట ట్రంప్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వీరిద్దరూ ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోదని ప్రకటించారు. పశ్చిమాసియాలో అమెరికా సైనికులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ లక్షంగా చేసుకుని దాడులు చేయకూడదని ఇరాన్‌ను హెచ్చరించారు. ఆ ప్రకారం ఇరాన్ ఏమీ చేయలేదు. కానీ టెహ్రాన్ టార్గెట్ నేరుగా ఇజ్రాయెల్ పైనే. ఇరాన్ క్షిపణుల పైన ఇజ్రాయెల్ దాడులు చేయడం, అమెరికా బి 2 బాంబర్లు బంకర్లను ధ్వంసం చేసే బాంబులను ఫర్దోపై ప్రయోగించడం, అమెరికా సబ్‌మెరైన్లు నతాంజ్, ఇస్పహన్ న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు చేయడం ఇవన్నీ జరిగాయి.

ఇదంతా నిస్సందేహంగా ట్రంప్ ప్రారంభించిన యుద్ధమే. అమెరికాలో, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతానన్న హామీతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆరు నెలల్లోనే యుద్ధోన్మాదిగా మారారు. ప్రపంచవాద దురాక్రమణ దారుడుగా పెరిగారు. యుద్ధాల విషయానికి వస్తే అమెరికా తాను చేసిన ఘోరమైన పొరపాట్లు ఏమిటో అంతగా తెలుసుకోవడం లేదు. 2001లో అల్‌ఖైదా ఉగ్రవాదిని అంతం చేస్తామని చెప్పి అఫ్గానిస్థాన్‌పై దండెత్తింది. తాలిబన్‌ను ఓడించి, ఆ దేశాన్ని ‘ప్రజాస్వామ్యం’ చేసింది. కానీ ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ తాలిబన్‌కే అఫ్గానిస్థాన్‌ను అప్పగించింది. 2003 లో బాగ్దాద్‌లో నరమేథాన్ని కోరుకునే ఆయుధాలు ఉన్నాయన్న సాకుతో ఇరాక్‌పై దాడులు చేసి సర్వం నాశనం చేసింది. లిబియా ప్రభుత్వం నుంచి లిబియన్లను రక్షిస్తున్నామని అబద్ధం చెప్పి 2011లో లిబియాపై దండెత్తింది. ఇక ఇరాన్ విషయంలో అమెరికా నిఘా సంస్థలు మార్చిలో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం చేపట్టడం లేదని నిర్ధారించాయి. గతంలో అణుకార్యక్రమంపై అమెరికా తదితర పాశ్చాత్య దేశాలతో ఒప్పందంలో సంతకం చేసినప్పుడు అణుకార్యక్రమాలపై ఇరాన్‌లో పరిశీలించడానికి ఇరాన్ ఒప్పుకుంది. కానీ ఆ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేసేశారు.

ఇరాన్ మళ్లీ అమెరికాతో చర్చలకు సమాయత్తమైంది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ సమయంలో దౌత్యాన్ని చెడగొట్టాడు. పశ్చిమాసియా సుస్థిరతపై, ప్రపంచ దేశాల మనుగడపై ఈ యుద్ధం తీవ్ర పరిణామాలు చూపిస్తోంది. ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను ఏనాటికీ వదులుకోదు. ఇరాన్ పాలక వర్గం ఈ సంక్షోభంలో నిలబడగలిగితే అణు కార్యక్రమాన్ని మళ్లీ చేపడుతుంది. నెతన్యాహు అదుపు లేని సైనికవాదం తన స్వదేశంలో అధికారంపై పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఓ భాగం. ఇది పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర భద్రతా అగాధంలో పడేసింది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరిక యుద్ధంగా ట్రంప్ మార్చేసి ఘోర విపత్తుగా అధ్వాన పరిస్థితిలోకి నెట్టేశారు. అయినా శాంతి దూతగా నోబెల్ బహుమతిని పొందాలని ఆకాంక్షించడం రొయ్యల మొలతాడు కట్టుకున్న పిల్లి రుద్రాక్షమాలలు ధరించిన సామెత గుర్తుకు వస్తుంది. అమెరికా పాలక వర్గం తాజాగా ఆయన పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించింది. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీకార్టర్ ఈ బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదిస్తూ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖను రాశారు. ఉక్రెయిన్‌కు చెందిన చట్టసభ సభ్యుడు ఒలెక్సాండర్ మెరెఝూకో కూడా ట్రంప్ పేరును నోబెల్‌కు ప్రతిపాదించారు.

కానీ రష్యాఉక్రెయిన్ మధ్య ఇంకా దాడులు కొనసాగుతుండడంతో యుద్ధం ఆపడంలో ట్రంప్ విఫలమయ్యారని ఆ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం నోబెల్ బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదించినా, ఇరాన్‌పై బంకర్ బస్టర్ బాంబులతో ట్రంప్ దాడులు చేయించడంతో విపక్షాల ఒత్తిడి మేరకు ఆ ప్రతిపాదనను పాక్ వెనక్కు తీసుకోక తప్పలేదు. గతంలోనూ 2018, 2020, 2021లోనూ ట్రంప్ పేరును కొంతమంది నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. కానీ ఫలింలేదు. ‘నాకు ఇప్పటికే నాలుగైదుసార్లు ఈ పురస్కారం రావాల్సింది. కానీ వాళ్లు నాకు ఇవ్వరు. కేవలం లిబరల్స్‌కు మాత్రమే ఇస్తారు’అని డెమొక్రటిక్ నేతలను ఉద్దేశిస్తూ ట్రంప్ ఇటీవల మీడియా ముందు అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే. అధికారం లోకి రాగానే టారిఫ్‌ల వార్‌తో ప్రపంచ దేశాల వాణిజ్య సంబంధాలను ఛిన్నాభిన్నం చేసిన ట్రంప్ ఇప్పుడు రణదాహంతో పేట్రేగిపోతున్నా నోబెల్ శాంతి బహుమతిపై వ్యామోహం వీడకపోవడం విచిత్రమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News