టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. టెట్ పరీక్షలను 9 రోజుల్లో 16 సెషన్స్ల్లో జరుగుతాయని, ప్రతి రోజు రెండు సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మెదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. కాగా, 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్ 1, ఆరో తరగతి, ఆ పైన బోధించే అభ్యర్థులు పేపర్ 2 ద్వారా పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉండగా, కొన్ని సబ్జెక్టులకు హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాల్లో ఉండనున్నాయి.
పరీక్షల తేదీలు….
జూన్ 18, 19, 24వ తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు, జూన్ 20, 23, 24, 27వ తేదీలలో పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) పరీక్ష జరగనుంది. జూన్ 30వ తేదీన ఒకే రోజు మధ్యాహ్నం సెషన్లో పేపర్ 2కు సంబంధించిన మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను త్వరలో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. ఈ షెడ్యూల్ ప్రకార పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు తమ జిల్లాలకు అనుగుణంగా తేదీలను గమనించి సన్నద్దం కావాలని అధికారుల సూచించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ సారి 1,83,653 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల తెలిపారు. పేపర్ 1 కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2 కు 1,20,392 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15 వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.