Tuesday, May 6, 2025

ఆర్‌టిసిలో సమ్మె నిషేధం.. చట్ట వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

సమ్మె పేరుతో ఉద్యోగులను బెడిరిస్తే చర్యలు తప్పవు
సమస్యలు పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం.. సమ్మె యోచన విరమించండి
ఆర్‌టిసి యాజమాన్యం పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, సమ్మె యోచనను విరమించుకోవాలని ఆర్‌టిసి యాజమాన్యం సూచించింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్‌టిసిలో సమ్మెలు నిషేధమని, సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమని పేర్కొంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీకుంటామని యాజమాన్యం హెచ్చరించింది. ఆర్‌టిసి కార్మికుల సమస్యలపై సిఎం రేవంత్ రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని యాజమాన్యం పేర్కొంది. సమ్మె వల్ల సంస్థ ప్రగతితో పాటు ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, తల్లి లాంటి ఆర్‌టిసిని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతో పాటు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం మరిచిపోవద్దని సూచించింది.

ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తూ.. సంస్థ మేలు కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉందని పేర్కొంది. మూడున్నరేళ్లుగా సంస్థ బాగు కోసం యాజమాన్యం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారని. వాటిని విజయవంతం చేశారని, అభివృద్ధి వైపు అడుగులు వేస్తోన్న సమయంలో సమ్మె పేరుతో చేజేతులా సంస్థ మనుగడకు, ఉద్యోగుల భవిష్యత్ కు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహారించవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీపడబోదని స్పష్టం చేసింది. ఉద్యోగులు క్షేత్రస్థాయిలో నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వల్లే ఆర్‌టిసి అభివృద్ధి పథంలో పయనిస్తోందని, సమిష్టి కృషితో పనిచేస్తూ బస్సుల్లో ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని, సంస్థను అన్ని తామై ముందుకు నడిపిస్తోన్న ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీపడటం లేదని మరోమారు స్పష్టం చేసింది. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చించడం జరుగుతోందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 పిఆర్‌సిని 21 శాతం ఫిట్ మెంట్ తో 2024 మే నెలలో యాజమాన్యం అందించిందని, పెండింగ్‌లో ఉన్న 10 డిఎలను 2019 నుంచి దశలవారీగా విడుదల చేసిందని, ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను చెల్లించిందని గుర్తు చేసింది.

గత మూడున్నరేళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదినే వేతనాలను ఇస్తోందని, పిఎఫ్, సిసిఎస్ రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమతప్పకుండా చెల్లిస్తూ బకాయిలను క్రమేణా యాజమాన్యం తగ్గిస్తోందని, ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యతనిస్తోందని యాజమాన్యం వెల్లడించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ది పథంలో పయనిస్తోన్న సంస్థకు, ఉద్యోగులకు సమ్మె అనేది తీరని నష్టం కలిగిస్తుందని, ఆర్‌టిసి బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని. సమ్మె అనేది సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేసింది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడిందని, ఆ సమ్మె వల్ల 39 మంది ఉద్యోగులను కొల్పోయిందని, సమ్మె తర్వాత వచ్చిన కరోనా వల్ల ఆర్‌టిసి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంది. మీ సమిష్టి కృషి వల్ల అన్ని సంక్షోభాలను ఎదుర్కొని ప్రజల మన్ననలు చూరగొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె అనేది శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఒక్కసారి ప్రజలు అసంతృప్తికి గురైతే కొంతకాలంగా సంస్థ బాగు, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలన్నీ నిర్వీర్యం అయిపోతాయని. ఇవన్నీ సంస్థ మనుగడకు ప్రతికూల అంశాలుగా మారే ప్రమాదం ఉందని యాజమాన్యం హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News