ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అరుంధతినగర్లో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం… దుదుకూరి స్వాతి తన భర్త వెంకటేష్తో గత 8 సంవత్సరాల క్రితం విడిపోయి కుమారుడు దుదుకూరి దుర్గాప్రసాద్ (11)తో కలిసి గుంటూరులో నివాసం ఉంటుంది. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతి అత్త యాదమ్మ వద్దకు గత నెల క్రితం జవహర్నగర్లోని అరుంధతినగర్కు కుమారుడితో కలిసి వచ్చింది. యాప్రాల్ కౌకూర్లో నివాసం ఉండే స్వాతి బంధువు అంజమ్మ కూడా తన కుమారుడు మాదాసు సుబ్రహ్మణం (08)తో కలిసి యాదమ్మ నివసించే అరుంధతినగర్కు వచ్చింది.
చిన్నారులు ఇద్దరు ఈ నెల 11వ తేదీ బుధవారం ఇంటి నుండి అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కాలనీలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం పిల్లల అదృశ్యంపై జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జవహర్నగర్ పోలీసులు పిల్లల ఆచూకి కోసం పలు ప్రాంతాల్లో వెతకగా, అరుంధతినగర్లోని క్వారీ గుంతలో పడి మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపారు. కాగా బంధువుల ఇంటికి వస్తే కుమారులు మృతి చెందడం పట్ల పిల్లల తల్లుల రోదనలు మిన్నంటాయి.