ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఆకస్మిక కుండపోత వర్షాలతో జనం నానా ఇక్కట్లకు గురి అయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి జాతీయ రహదారి వెంబడి నివసిస్తున్న కూలీల గుడారాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆదివారం ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఏడుగురు గల్లంతు అయ్యారు. వీరి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. యమునా నది వరదలకు కూలీలు కొట్టుకుపోయారు. 18 కిలోమీటర్ల దూరంలోని టిలాది షహీద్ స్మారక్ వద్ద ఇద్దరు కూలీలు చనిపోయి ఉండగా కనుగొన్నారు. మిగిలినవారు వరదలకు కొట్టుకుపోయారు. ఉత్తరకాశీ పలు ప్రాంతాలలో వరదలు తలెత్తాయి. దీనితోజనజీవితం స్తంభించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి కూలీపనులు చేసుకుంటున్న కుటుంబాలకు ఈ భారీ వర్షాలు నిండు విషాదం నింపాయి.
వీరంతా నేపాలీలు అని తేలింది. ఉత్తరకాశీలోని పాలిగడ్కు ఎగువన 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలాయ్ బెండ్ వద్ద కూలీల గుడిసెలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో ఓ హోటల్ భవన నిర్మాణ పనులకు కూలీలు వచ్చారు. నిర్మాణ పనుల్లో ఉండగానే వీరిపై బండరాళ్లు వచ్చిపడినట్లు వెల్లడైంది. మరికొందరు కూలీలు గుడిసెల్లో ఉన్నప్పుడు దెబ్బతిన్నారు. ఇక్కడ 29 మంది వరకూ కూలీలు ఉన్నారు. గల్లంతయిన కూలీలు క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. వారి జాడకోసం గాలిస్తున్నారని వివరించారు. భారీ వర్షాలతో యమునోత్రి నుంచి వచ్చే వేలాది మంది యాత్రికులు మార్గమధ్యంలో చిక్కుపడ్డారు. తదుపరి సూచనల వరకూ ఎక్కడివారు అక్కడనే ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.