హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి జరుగుతున్న మిస్ వరల్డ్-2025 నిర్వహణపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ (Milla Magee) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మిస్ వరల్డ్-2025 నిర్వాహకులు చాలా ఇబ్బందులకు గురి చేశారని.. తను తాను ఓ వేశ్య అనే భావన కలిగించేలా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విచారణ పూర్తైందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. మిల్లా మ్యాగీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని స్పష్టం చేశారు. మిస్ వరల్డ్ (Miss World) నిర్వహకులు ఆమెపై లండన్లో కేసు వేశారని.. అక్కడ ప్రభుత్వమే చట్టరీత్య చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన మిల్లా మ్యాగీ (Milla Magee).. ఆ తర్వాత సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు. అయితే విచారణలో మిల్లా చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. అంతేకాక.. మిస్ వరల్డ్ (Miss World) ఆర్గనైజేషన్ ఛైర్మన్, సిఇవొ జూలియా మోర్లీ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. తన తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబ అత్యవసర పరిస్థితి ఏర్పడి పోటీ నుంచి వైదొలుతానని మిల్లా అభ్యర్థించినట్లు మోర్లీ తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలు గౌరవం, బ్యూటీ విత్ ఎ పర్పస్ విలువలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.